నాకు మంత్రి పదవి ఇష్టం లేదు, కానీ, లోకేష్ సంచలనం
పార్టీ పెద్దల ఒత్తిడి మేరకే తాను మంత్రిపదవిని తీసుకొన్నానని ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ ,గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి నారాలోకేష్ చెప్పారు.
విశాఖపట్టణం: పార్టీ పెద్దల ఒత్తిడి మేరకే తాను మంత్రిపదవిని తీసుకొన్నానని ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ ,గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి నారాలోకేష్ చెప్పారు. పార్టీ అవసరాల రీత్యా తనను మంత్రివర్గంలోకి తీసుకొన్నారని ఆయన చెప్పారు.
శుక్రవారంనాడాయన విశాఖపట్టణంలో పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.నూకాలమమ ఆలయ ఆవరణలో రూ.50 లక్షలతో నిర్మించనున్న కళ్యాణ మండపానికి భూమిపూజ చేశారు లోకేష్.
అనంతరం ఆయన పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.తనకు మంత్రి పదవి చేపట్టాలనే కోరిక లేదన్నారు.అయితే పార్టీ పెద్దలు తనను కూర్చోబెట్టి మంత్రి పదవిని తీసుకోవాలని కోరారు.
అయితే మంత్రిపదవిని చేపట్టడం ద్వారా పార్టీకి ప్రయోజనం కలుగుతోందని పార్టీ పెద్దలు ఒత్తిడి తెచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఈ మేరకు తాను మంత్రిపదవిని తీసుకొన్నట్టు ఆయన చెప్పారు.అయితే గ్రామాలను అభివృద్ది చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్టేనని చెప్పారు. అందుకే తనకు గ్రామాలను అభివృద్ది చేసే శాఖను ఇవ్వాలని కోరాను.ఈ కోరిక మేరకు తనకు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖను కేటాయించిన విషయాన్ని చెప్పారు.
రానున్న రెండేళ్ళలో ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తానని లోకేష్ చెప్పారు. గ్రామాలను అభివృద్ది చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకొంటామని చెప్పారు.