వైఎస్ జగన్ రాజ్యంలో ఏపీ ఈజ్ ఆఫ్ కిల్లింగ్ బిజినెస్ లో నెంబర్ వన్ : నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు
ఏపీ మాజీమంత్రి,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా పరిణామాలపై నిప్పులు చెరిగారు .
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ వన్ గా ఉందని, వైయస్ జగన్ రాజ్యంలో ఏపీ ఈజ్ ఆఫ్ కిల్లింగ్ బిజినెస్ లో నంబర్ వన్ గా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు జగన్ రెడ్డి గారి పాలన చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే కంపెనీ లేదు. ప్రస్తుతం ఉన్న కంపెనీలు ఆయన ఉండనివ్వరు అంటూ విమర్శలు గుప్పించారు నారా లోకేష్. పార్టీలో చేరితే కండువా లేకపోతే వేధింపులు అంటూ టిడిపి నేతలపై ప్రభుత్వ వేధింపులపై కూడా నిప్పులు చెరిగారు నారా లోకేష్.
తాజాగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు సంబంధించి అమర్ రాజా కంపెనీ కేటాయించిన భూములను వెనక్కు తీసుకోవడంపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైసిపి ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందని ఆయన మండిపడ్డారు . 22 మంది ఎంపీలు ఉన్నా వారు సాధించినది శూన్యమని టీడీపీకి ఉన్న ఎంపీలు ముగ్గురు అయినప్పటికీ ప్రత్యేక హోదా దగ్గర్నుండి, రాష్ట్ర సమస్యల వరకూ ఢిల్లీలో వారు పోరాడుతున్న తీరును జీర్ణించుకోలేక గల్లా జయదేవ్ పై ఇటువంటి చర్యలకు పూనుకున్నారు అని నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు.
Recommended Video
డాక్టర్స్ డే సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేష్ కుటుంబాలకు దూరంగా కరోనా వైరస్ మహమ్మారి తో పోరాడుతున్న వైద్యులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తూ ఉంటే వైసీపీ ప్రభుత్వం వారిని అవమానాలకు గురి చేస్తుందని పేర్కొన్నారు. డాక్టర్లను అవమానించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనిత రాణి ఉదంతాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు నారా లోకేష్. డాక్టర్లు పిపిఈ కిట్లు, మాస్కుల కోసం ప్రభుత్వంతో పోరాటం చేయడం దురదృష్టకరమని పేర్కొన్న లోకేష్ డాక్టర్ల సేవలను గుర్తించాలని, డాక్టర్లను వేధింపులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.