తెలంగాణలో నయీమ్ ట్యాక్స్.. ఏపీలో లోకేష్ ట్యాక్స్ : అంబటి
హైదరాబాద్ : టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. తెలంగాణలో గ్యాంగ్స్టర్ నయీమ్ ట్యాక్స్ వసూళ్లు చేసిన తరహాలో.. ప్రస్తుతం ఏపీలో లోకేష్ ట్యాక్స్ వసూళ్లు నడుస్తున్నాయని ఆరోపించారు. లోకేష్ అంటేనే అవినీతికి కేరాఫ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సీఎం చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ను సీఎం చేయాలనుకున్న లక్ష్యంతో ఉన్నారనని, అయితే అది ఎన్నటికీ జరిగే పని కాదని అన్నారు అంబటి. ఇక అభివృద్ధికి అడ్డుపడుతున్నారని వైసీపీపై చేస్తోన్న ఆరోపణలను తిప్పికొట్టిన అంబటి.. రాజధాని, ప్రాజెక్టుల నిర్మాణాలకు తమ పార్టీ వ్యతిరేకం కాదని, చంద్రబాబు చేస్తోన్న దోపిడీలకు, అక్రమాలకే తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. చంద్రబాబు దోపిడీలను బయటపెడుతుండడంతో.. వైసీపీపై కక్ష సాధించాలన్న ఉద్దేశంతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ.. అంబటి ఫైర్ అయ్యారు.
ప్రభుత్వం చిత్తశుద్దితో గనుక అభివృద్ధి చర్యలు చేపడితే.. తమ పార్టీ తరుపున తప్పనిసరిగా మద్దతు తెలుపుతామని చెప్పారు అంబటి. ఇక ఏపీకి 15.6 శాతం పెట్టుబడులు వచ్చాయని చెప్తుండడాన్ని తీవ్రంగా తప్పుబట్టారాయన. దేశవ్యాప్తంగా 954 బిలియన్ల పెట్టుబడులు వస్తే, అందులో ఏపీకి మాత్రమే 15.6 శాతం పెట్టుబడులు వచ్చాయనడం అర్థరహితమని కొట్టిపారేశారు.