కడప పాలిటిక్స్ పై లోకేష్ సీరియస్ : యనమల వియ్యంకుడికి గట్టి వార్నింగ్
కడప : టీడీపీ జిల్లా రాజకీయాల్లో అంతర్గత ఆధిపత్య పోరు ఆ పార్టీకి కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. ఒకే గూటి నేతల మధ్య విబేధాలు అధిష్టానంతో ఫిర్యాదుల వరకు వెళ్లడంతో వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతలను పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదే నేపథ్యంలో.. కడప జిల్లా మైదుకూరు నియోజవర్గ రాజకీయాలపై లోకేష్ కి అక్కడి టీడీపీ నేతల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో విషయంపై ఆరా తీశారట లోకేష్. కాగా మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు, ఏ-1 కాంట్రాక్టర్ అయిన సుధాకర్ యాదవ్ ఆధిపత్య పోకడలే అక్కడి టీడీపీ నేతల అసంతృప్తికి ప్రధాన కారణంగా సమాచారం.
నియోజకవర్గ రాజకీయాల్లో ప్రతీ విషయంలో సుధాకర్ యాదవ్ జోక్యం పెరిగిపోయిందని, మిగతా ఏ నేతను ఆయన కనీసం లెక్క చేయని పరిస్థితులు తలెత్తడంతో, చేసేదేమి లేక ఇక విషయాన్ని లోకేష్ దృష్టి తీసుకొచ్చినట్టుగా టీడీపీ నేతలు వాపోయినట్టుగా తెలుస్తోంది.
మంత్రి, వియ్యంకుడు యనమల తన వెనకాల ఉన్నారన్న ధీమాతోనే, నియోజకవర్గంలో తన కులానికి చెందినవారికే సుధాకర్ యాదవ్ పెద్ద పీట వేస్తున్నారనేది ఆయనపై మైదుకూరు టీడీపీ నేతలు చేస్తోన్న ప్రధాన ఆరోపణ. మైదుకూరు నియోజకవర్గంలో 70 శాతం మంది ఉద్యోగులు సుధాకర్ యాదవ్ సామాజిక వర్గానికి చెందినవారేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బయటకొచ్చిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి, జగన్ మీదున్న అసంతృప్తితో సుధాకర్ యాదవ్ కి మద్దతు పలికారు. అయినా సరే ఓటమిని తప్పించుకోలేకపోయారు సుధాకర్ యాదవ్. ఇదిలా ఉంటే ప్రస్తుతం టీడీపీలోకి వచ్చేందుకు డీఎల్ చేస్తోన్న ప్రయత్నాలకు కూడా సుధాకర్ యాదవ్ అడ్డుపడుతున్నారన్న ఆరోపణలున్నాయి.
ఇలా ప్రతి విషయంలో సుధాకర్ యాదవ్ తమకు ప్రతికూలంగా వ్యవహరిస్తుండడంతో, అసహనానికి లోనైన అక్కడి టీడీపీ నేతలు లోకేష్ కి ఫిర్యాదు చేశారు. దీంతో సుధాకర్ యాదవ్ తో ఈ విషయం గురించి చర్చించిన లోకేష్, ఆయన్ను గట్టిగానే మందలించారని తెలుస్తోంది. నియోజకవర్గంలో ఉండే పోస్టులన్నింటిలో మీ సామాజిక వర్గం వారే ఉండాలనుకుంటే ఎలా..? అంటూ ప్రశ్నించారట లోకేష్.
ఇకపోతే, గత ఎన్నికలతో పోల్చితే సుధాకర్ యాదవ్ తీరు పట్ల అక్కడి జనం కూడా సానుకూలంగా లేరని చెప్పారట లోకేష్. రాబోయే ఎన్నికల్లో సుధాకర్ యాదవ్ గెలవడానికి 30 శాతం అవకాశాలు కూడా లేవని పార్టీ నివేదికలు చెబుతున్నట్టుగా అందరి ముందే ఆయన్ను దుమ్ము దులిపేశారట. ఇకమీదట మళ్లీ ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని గట్టిగానే హెచ్చరించారని కడప పాలిటిక్స్ లో చర్చ జరుగుతోంది.
ఇక లోకేష్ మందలించినప్పటి నుంచి సుధాకర్ యాదవ్ నియోజవర్గంలోని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోకేష్ మందలింపు విషయాన్ని తన వియ్యంకుడు యనమలతో సుధాకర్ యాదవ్ విన్నవించుకున్నట్టు సమాచారం .