బీజేపీకి ఇక ఛాన్స్ ఎక్కడిది?, గవర్నర్ ఆ నిర్ణయమే తీసుకుంటారనుకుంటున్నా: జయప్రకాష్
హైదరాబాద్: కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటికీ.. అధికారం చేపట్టెదెవరు? అన్న దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ అధికార పీఠానికి కొద్ది దూరంలో ఆగిపోయింది. జేడీఎస్ ను చీలిస్తే తప్ప ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కష్టం. కాబట్టి ఆ పార్టీ ఆశలన్నీ జేడీఎస్ ను చీల్చడం మీదే ఉన్నాయి.
Recommended Video
మరోవైపు జేడీఎస్ కాంగ్రెస్ తో అవగాహనలో భాగంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఉత్సాహం కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని స్వాగతిస్తారు? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. ఇదే అంశంపై లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ తాజాగా తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో రాష్ట్రపతి ప్రధానమంత్రిని, గవర్నర్ సీఎంని ఆయా సభల్లోని సభ్యుల మెజారిటీ ఆధారంగా నియమిస్తారని జేపీ అన్నారు. బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకున్నప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినంత మెజారిటీ లేదని పేర్కొన్నారు. అదే సమయంలో జేడీఎస్కి కాంగ్రెస్ భేషరతుగా ప్రకటించిందని గుర్తుచేశారు.
ఇలాంటి తరుణంలో ఇక బీజేపీకి వేరే పార్టీ సభ్యుల మద్దతు ఎలా లభిస్తుందని ఆయన ప్రశ్నించారు. ఒక అలా జరగాలంటే వేరే పార్టీలను చీల్చాలని, అది రాజ్యాంగ విరుద్దమని అన్నారు. కాబట్టి కాంగ్రెస్, జేడీఎస్లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించేలా గవర్నర్ నిర్ణయం ఉంటుందని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు.
ఇక బీజేపీ ఎక్కువ స్థానాల్లో గెలవడంపై స్పందిస్తూ.. ఆ పార్టీ కార్యకర్తలు నిబద్దతతో ఆత్మవిశ్వాసంతో పనిచేశారని జేపీ అన్నారు. మిగతా పార్టీలలో అది కొరవడిందని పేర్కొన్నారు.