మోడీవైపు లోక్సత్తా: మల్కాజిగిరినుండి పోటీకి జెపి రెడీ!
హైదరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మరో ఎన్నికల పొత్తు తెర పైకి వస్తోంది. భారతీయ జనతా పార్టీతో పొత్తుకు లోక్సత్తా పార్టీ సుముఖత వ్యక్తం చేస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు బిజెపి అగ్రనాయకత్వానికి ఇప్పటికే సంకేతాలు పంపిందట. బిజెపి అగ్రనేతల నుంచి సానుకూల స్పందన వస్తే రెండు పార్టీల మధ్య ఇరు రాష్ట్రాల్లోనూ సర్దుబాట్లు ఉండే అవకాశముంది.
ఆర్థిక, ఇతర విధానాల్లో ఇరు పార్టీలకూ సారూప్యత ఎక్కువగా ఉన్న దృష్ట్యానే తాము పొత్తుకు సుముఖంగా ఉన్నట్లు లోక్సత్తా నేతలు చెబుతున్నారు. ప్రజలు కోరుతున్న ప్రత్యామ్నాయాన్ని వారు గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీలోనే చూస్తున్నారని, ఈ సారి కేంద్రంలో బిజెపినే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని లోక్సత్తా నాయకత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో పునర్నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అవసరమంటోంది. వాస్తవానికి ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో సర్దుబాట్లు చేసుకునేందుకు మొదట్లో ఆమ ఆద్మీ పార్టీ (ఎఎపి)తో లోక్సత్తా సంప్రదింపులు జరిపింది. అయితే ఆ చర్చలు విఫలమయ్యాయి. ఎఎపి ఇప్పటికే రాష్ట్రంలో తన శాఖలను ప్రారంభించింది. కానీ, తాజాగా బిజెపితో పొత్తుకు లోక్సత్తా ప్రయత్నాలు ప్రారంభించింది.
ఇదిలా ఉండగా, ఈ సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు జెపి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఈ స్థానంలో 5 లక్షల మంది యువత, విద్యార్థులు ఉన్నారని, వారిలో ఎక్కువ శాతం మంది జెపి అభ్యర్థిత్వానికే మద్దతు పలుకుతున్నారని లోక్సత్తా చెబుతోంది. యువతకు తోడు బిజెపి మద్దతు లభిస్తే జెపి గెలుపు సునాయాసమంటున్నారు.