అవిభక్త కవలలు వీణావాణీలకు శుభవార్త: లండన్లో ఆపరేషన్
హైదరాబాద్: గత 11 ఏళ్లుగా తలలు అతుక్కుని నరకయాతన అనుభవిస్తున్న అవిభక్త కవలు వీణా-వాణీలకు లండన్ వైద్యులు ఆశలు చిగురింపచేశారు. శనివారం నగరానికి చేరుకున్న గ్రేట్ ఆర్మండ్ స్ర్టీట్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ డేవిడ్ డునావే, డాక్టర్ జిలానీలు నిలోఫర్లో ఉన్న వీణా-వాణీలకు వైద్య పరీక్షలు జరిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వైద్యులు వీణా-వాణీకి వైద్య పరీక్షలు నిర్వహించామని, శస్త్ర చికిత్స చేయాలని నిర్దారణకు వచ్చామని తెలిపారు.
ఆపరేషన్ 80 శాతం సక్సెస్ అయ్యే అవకాశం ఉందని వారు తెలిపారు. గతంలోనూ ఇలాంటి రెండు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్యులు వెల్లడించారు. వీణా-వాణీని లండన్ తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తే మంచిదని వారు అభిప్రాయపడ్డారు. ఐదు దశల్లో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని ఆరు నుంచి 9 నెలల సమయం పడుతుందని లండన్ వైద్యులు పేర్కొన్నారు. మరోవైపు వీణా-వాణికి ఆపరేషన్ తమకు అంగీకారమే అని, లండన్లో ఉండటానికి సిద్ధమే అని తల్లిదండ్రులు తెలిపారు.
ఖర్చు గురించి ఇప్పుడే చెప్పలేమని, లండన్ వెళ్లి తర్వాత నివేదిక రూపొందించి అన్ని వివరాలు తెలియజేస్తామని వారు చెప్పారు. ఈ శస్త్రచికిత్స ఇద్దరు మాత్రమే చేసిది కాదని, వైద్యుల బృందం అవసరమని, అందువల్ల ఇక్కడ చేయడం సాధ్యం కాదని, లండన్లోనే చేయాల్సి ఉంటుందని వారు చెప్పారు. శస్త్రచికిత్స వల్ల సంభవించే అనుకోని దుష్పరిణామాల గురించి కూడా తల్లిదండ్రులకు వివరించామని, శస్త్రచికిత్స ఫలవంతం కావడానికి ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పామని వారు చెప్పారు.
శస్త్రచికిత్స ద్వారా ఇరువురుని వేరు చేయవచ్చని తెలిపారు. పదేళ్ల క్రితం ఒకసారి, నాలుగేళ్ల క్రితం మరోసారి అవిభక్త కవల పిల్లలకు శస్త్ర చికిత్స చేసి విడదీశామని పేర్కొన్నారు. మరోసారి ఇక్కడే పరీక్షలు నిర్వహిస్తామని, తుది దశ పరీక్షలు లండన్ లో జరుగుతాయని వైద్యులు వివరించారు.
వీణావాణీల మెదళ్లు వేర్వేరుగా ఉన్నాయని, రక్తనాళాలు మాత్రమే కలిసి ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారి చెప్పారు. మూత్రపిండాలపై, గుండెపై ప్రభావాన్ని బట్టి ఆపరేషన్ ఏ దశలో చేయాలనేది నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. సింగపూర్లో శస్త్ర చికిత్స చేయడంతో అవిభక్త కవలలు మరణించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అటువంటి శస్త్రచికిత్సలను నిషేధించడాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, సింగపూర్ పరిస్థితి వేరని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రభుత్వమే లండన్ వైద్యులను పిలిపించిందని ఆయన చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం తమకు సాయం అందిస్తున్నందుకు పాదాభివందనం చేస్తున్నామని వీణా వాణీల తల్లి అన్నది. లండన్ డాక్టర్ల ప్రకటన వీణా - వాణి తల్లిదండ్రుల్లో సంతోషాన్ని నింపింది. 11 ఏళ్ల తమ నిరీక్షణ ఫలించిందని వీణా - వాణి తల్లిదండ్రులు అన్నారు. పుట్టినప్పటి నుంచి తమ పిల్లలు నరకం అనుభవిస్తున్నారని తెలిపారు. వీణా - వాణి తల్లిదండ్రుల ముఖంలో వెలుగు కనిపిస్తుంది. వీణా - వాణి ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో ఉన్నారు. శస్త్ర చికిత్స చేసే సమయంలో తమలో ఒక్కరు లండన్లో ఉండవచ్చునని వైద్యులు చెప్పినట్లు వారు తెలిపారు.