తిరుమలలో శ్రీవారి నగలు మాయం: ఏఈవో నుండి రికవరీ: విచారణ లేకుండానే చర్యలు..!!
తిరుమల లో మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తిరుమల ట్రెజరీలో శ్రీవారి నగలు మాయమైన విషయం ఆలస్యంగా బయటకు తెలిసింది. ట్రెజరీలో ఉండాల్సిన అయిదు కిలోల వెండి కిరీటం.. రెండు బంగారు ఉంగరాలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. అయితే, టీటీడీ ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని గుట్టుగా ఉంచారు. దీనికి బాధ్యులు ఎవరనేది విచారణ చేయకుండా.. టీటీడీ ఏఈవో శ్రీనివాసులుపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆభరణాల విలువను అతని జీతం నుంచి రాబట్టారు. వ్యక్తమవుతున్నాయి. ఘటనకు కారకులు ఎవరే విషయాన్ని నిర్ధారించుకోకుండానే శ్రీనివాసులు నుంచి రికవరీ చేయటం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ట్రెజరీలో శ్రీవారి నగలు మాయం..
టీటీడీలో మరోసారి కలకలం చెలరేగింది. వరుస వివాదాలతో తిరుమల లో కొద్ది రోజులుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడుగుడుగునా నిఘా..ప్రత్యేక సిబ్బంది ఉండే టీటీడీ ట్రెజరీలోనే నగలు మాయం అయ్యాయి. ట్రెజరీలో ఉన్న ఉన్న 5 కిలోల వెండి కిరీటం, రెండు బంగారు ఉంగరాలు మాయమయ్యాయి. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి టీటీడీ ఏఈవో శ్రీనివాసులుపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆభరణాల విలువను అతని జీతం నుంచి రాబట్టారు. మరోవైపు శ్రీనివాసులుపై ఏకపక్షంగా చర్యలు తీసుకోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు కారకులు ఎవరే విషయాన్ని నిర్ధారించుకోకుండానే శ్రీనివాసులు నుంచి రికవరీ చేయడాన్ని తప్పుబడుతున్నారు. ఆయన జీతం నుంచి రికవరీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో శ్రీనివాసులు జీతం నుంచి ప్రతి నెల రూ.30వేలు రివకరీ చేయనున్నారు. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తప్పు చేస్తే చర్యలు తీసుకోకుండా.. రికవరీ చేయడమేంటని భక్తులు మండిపడుతున్నారు. అయితే టీటీడీ అధికారులు మాత్రం ఈ విషయం మీద ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు.
వరుస వివాదాలతో కలకలం..
టీటీడీలో కొద్ది రోజులుగా వివాదాలు కొనసాగుతున్నాయి. తిరుమలతొ బ్రేక్ దర్శనాల రద్దు పైన నూతన ఛైర్మన్ తీసుకున్న నిర్ణయం పైన సామాన్య భక్తుల నుండి హర్షం వ్యక్తం అవుతున్నా.. ప్రతీ రోజులు వెలుగు లోకి వస్తున్న దళారీల విషయం పైన ఇప్పటి వరకు ఎందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్న ఎదురవుతోంది. అదే విధంగా తిరుమల ఆర్టీసి బస్సుల్లో అన్యమత ప్రచారం ఉన్న టిక్కెట్ల వ్యవహారం జాతీయ స్థాయిలో వివాదానికి..ప్రభుత్వం పైన విమర్శలకు కారణమైంది. దీని పైన సీఎస్ తిరుమలకు వెళ్లి విచారణ చేసారు. అక్కడ తిరుమలలో హిందూ ధర్మం కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి పైన ఉందని..ఉద్యోగుల ఇళ్లల్లో నూ తనిఖీలు చేస్తామని స్పష్టం చేసారు. తొలుత టీటీడీ చైర్మన్ గా సుబ్బారెడ్డి నియమాకం సమయంలోనే ఆయన పైన మత పరమైన ఆరోపణలు ఎదురయ్యాయి.
ఢిల్లీలో శ్రీవారి ఉత్సవాల పేరుతో
ఇక, ఇప్పటి వరకు ప్రభుత్వం టీటీడీలో పాలక వర్గం ఏర్పాటు చేయలేదు. మొత్తం నిర్ణయాలు ఛైర్మన్..స్పెషలాఫీసర్.. ఈవో పరిధిలో తీసుకుంటున్నారు. ఇక, ఢిల్లీలో శ్రీవారి ఉత్సవాల పేరుతో దాదాపు అయిదు కోట్ల రూపాయాల ఖర్చుకు సంబంధించి వివాదం ..విచారణ సాగుతోంది. ఢిల్లీలో లోకల్ అడ్వైజరీ బోర్డు ఛైర్మన్ పోస్టుకు ఈ వివాదాల కారణంగా ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ రాజీనామా చేసారు. ఇలా వివాదాలు కంటిన్యూ అవుతున్న సమయంలో తాజాగా ట్రెజరీలో శ్రీవారి నగలు మాయం అవ్వటం..విచారణ లేకుండా ఒక అధికారిని బాధ్యుడిని చేయటం వంటివి చోటు చేసుకున్నాయి. ఇక, ఇప్పుడు టీటీడీ అధికారులు ఈ వ్యవహారం పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.