వైవీ సుబ్బారెడ్డి చుట్టూ మరో వివాదం..!! శ్రీవారి ప్రసాదానికి అపచారం.. అతని పాదాల వద్ద?
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మరో వివాదానికి కేంద్రబిందువు అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కుదురుగా ఉండనిచ్చేలా కనిపించట్లేదాయన. తెలిసి చేస్తున్నారో.. తెలియక చేస్తున్నారో తెలియట్లేదు గానీ.. సరికొత్త విమర్శలకు తెర తీశారు. పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి వారి తీర్థప్రసాదాలను మానవమాత్రుడైన విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి వారి పాదాల వద్ద ఉంచారనే ఆరోపణలు తాజాగా వెల్లువెత్తాయి. ప్రత్యేకించి- తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు ఈ విషయంపై పెద్ద రాద్ధాంతమే చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.
నమ్ముకున్నందుకు పంగనామాలు పెడతారా?: సొంత పార్టీ ఎమ్మెల్యేపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం
అసలు వివాదమేంటీ?
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రెండురోజుల కిందట న్యూఢిల్లీ పర్యటనకు వెళ్లారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తదితర ప్రముఖులను కలుసుకున్నారు. వారికి శ్రీవారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. కొత్తగా ఎవరు టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినా.. కేంద్రమంత్రులను కలుసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే ఆనవాయితీని ఆయన కూడా కొనసాగించారు. అక్కడిదాకా బాగానే ఉంది.
హృషికేశ్ శారదాపీఠం ఆశ్రమంలో..
న్యూఢిల్లీ పర్యటన అనంతరం వైవీ సుబ్బారెడ్డి నేరుగా ఉత్తరాఖండ్ లోని హృషికేశ్ వెళ్లారు. విశాఖ శారదాపీఠానికి అక్కడ ఓ ఆశ్రమం ఉంది. ప్రస్తుతం స్వరూపానందేంద్ర స్వామి అక్కడే ఉంటున్నారు. ఆయనను పలకరించడానికి వైవీ సుబ్బారెడ్డి హృషికేశ్ వెళ్లారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామికి తిరుమల శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అక్కడే వచ్చింది అసలు చిక్కంతా. స్వామి తీర్థ ప్రసాదాలు ఉన్నట్టుగా చెబుతోన్న ఓ ప్లాస్టిక్ కవర్ ను వైవీ సుబ్బారెడ్డి నేరుగా స్వరూపానందేంద్ర స్వామి వారి చేతులకు అందజేయలేదు. ఆయన కూర్చున్న పీఠానికి ఎదురుగా.. నేలపై ఉంచారు. ఆ కవర్ లో శ్రీవారి లడ్డు, ఇతర తీర్థ ప్రసాదాలు ఉన్నాయనేది తాజాగా షోషల్ మీడియాలో చర్చనీయాంశమై కూర్చుంది.
మరో వివరణ తప్పట్లేదా?
ఆ కవర్ లో శ్రీవారి లడ్డూ, అప్పడం ఉందనేది సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు చేస్తోన్న ఆరోపణ. అందులో శ్రీవారి తీర్థ ప్రసాదాలు ఉన్నాయా? లేవా? అనే విషయం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. దీనిపై వైవీ సుబ్బారెడ్డి మరోసారి వివరణ ఇచ్చుకునే దాకా వెళ్లేలా కనిపిస్తోంది ఈ పరిస్థితి. ఇదివరకు తన క్యాంపు కార్యాలయాన్ని రాజధాని అమరావతి ప్రాంతంలోని తాడేపల్లిలో ఏర్పాటు చేస్తానంటూ ఓ వివాదానికి తెర తీశారు వైవీ సుబ్బారెడ్డి. ఆ తరువాత ఆయన మాట మార్చారు. అది టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయం కాదని, కేవలం సమాచార కేంద్రం మాత్రమేనని వివరణ ఇచ్చుకున్నారు. తాజాగా- స్వరూపానందేంద్ర స్వామికి తీర్థ ప్రసాదాల అందజేతపైనా ఆయన వివరణ ఇచ్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీన్ని తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు పెద్ద ఎత్తున వివాదాన్ని చేస్తున్నారు.