గోవిందా.. గోవింద.. అంతా మాయే గోవింద.. ''జగనన్న'' గోవింద!!
గోవిందా.. హరి గోవిందా.. వెంకటరమణా గోవిందా.. రాష్ట్రంలో అంతా మాయే గోవిందా.. జగనన్న మాయే గోవిందా.. అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరుపతిలో వినూత్నరీతిలో తమ నిరసన తెలియజేశారు. సోమవారం నియోజకవర్గ ఇన్ఛార్జి సుగుణమ్మ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు నరసింహ ప్రసాద్ వేంకటేశ్వరస్వామి వారి వేషధారణ వేశారు.
మూడు సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు గోవిందా అంటూ వినూత్నంగా ప్రభుత్వ కార్యక్రమాలపై తమ నిరసనను తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చివేశారు గోవిందా.. ఉన్న రాజధాని తీసేశారు గోవిందా.. అన్న క్యాంటిన్లు ఎత్తేశారు గోవిందా.. రైతులకు రాయితీలు తీసేశారు గోవిందా.. నిత్యావసర సరుకులు పెరిగాయి గోవిందా.. పిల్లల చదువులు గోవిందా.. మహిళల భద్రత గోవిందా అంటూ నృత్యరూపకం ప్రదర్శించారు.
ఈ సందర్భంగా సుగణమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని, బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు ప్రకాశం జిల్లాలో కవిత అనే మహిళ ఇంటి గేటుకు తాళం వేస్తే ఇంతవరకు రక్షించేవారు లేరని, ఇంతకంటే అరాచక పాలన కావాలా? అంటూ ప్రశ్నించారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తుంటే వారిపై కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని జగన్ చేతుల్లోనుంచి కాపాడాలని శ్రీ వెంకటేశ్వరస్వామివారినే కోరుకున్నామని, అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్, తిరుపతి నగర కమిటీ, తిరుపతి కార్పొరేటర్, స్టేట్, జిల్లా, మహిళ, యువత, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.