రాజమండ్రి వంతెనపై నుంచి ట్రాక్పై పడిన లారీ: రైళ్ల ఆలస్యం(వీడియో)
రాజమహేంద్రవరం: నగరంలోని రోడ్డు కమ్ వంతెనపై మంగళవారం ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ఓ లారీ మరొక ఇసుక లారీని ఢీకొని వంతెనపై నుంచి రైల్వే ట్రాక్పై తిరగబడింది. ఈ ప్రమాదంలో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. ఈ ఘటనతో విజయవాడ- విశాఖ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం మేర్పడింది.
వివరాల్లోకి వెళితే... విజ్జేశ్వరం నుంచి కొవ్వూరు మీదుగా రాజమహేంద్రవరం వస్తున్న లారీ వంతెన మలుపు వద్ద ఆగివున్న మరో ఇసుక లారీని ఢీకొట్టి పై నుంచి రైల్వే ట్రాక్పై పడింది. ఈ ఘటనతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
రైల్వే అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైల్వే ట్రాక్పై పడిన లారీని తొలగించారు. విద్యుత్ సరఫరా పునరుద్దరించేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన లారీ డ్రైవర్, క్లీనర్కు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
హౌరా-విశాఖ-విజయవాడ-చెన్నై ప్రధాన రైల్వే లైనుపై నిత్యం వందల సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇసుక లారీ ట్రాక్పై పడిన ఉదయం 5.30గంటల సమయంలో విశాఖ-విజయవాడ రైలు వెళ్లింది. రైలుపై లారీ పడి ఉంటే పెను ప్రమాదం సంభవించేది.
అలాగే లారీ పడిన ట్రాక్ వద్దే అండర్ పాస్ ఉంది. దాని మీద పడినా... రాకపోకలు సాగించే వాహనదారులకు ప్రమాదం జరిగేది. కాగా, గాయపడిన లారీ డ్రైవర్, క్లీనర్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ రాజకుమారి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.