రూ.7.50 కోట్ల విలువైన సెల్ఫోన్లు లోడు కొట్టెయ్యాలని...లారీ డ్రైవర్ దొంగనాటకం
ఒంగోలు: ఒకటి కాదు రెండు కాదు...6,600 సెల్ ఫోన్లు...అవి కూడా అల్లాటప్పా కంపెనీ కాదు...వరల్డ్ ఫేమస్ బ్రాండ్ రెడ్ మీ కంపెనీవి...వీటి విలువ 7.50 కోట్ల రూపాయలు.
అయితే ఇంత విలువైన ఫోన్ల లోడుతో ఉన్న తన లారీని ఎవరో కొట్టేశారని ఓ లారీ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతులో ఉన్న సరుకు, వాటి విలువ తెలియడంతోనే పోలీసుల గుండెలు గుభేలు మన్నాయి. దీంతో వెంటనే పై అధికారులకు సమాచారం ఇచ్చి రంగంలోకి దిగారు. వెంటనే లారీ సమాచారం కోసం రహదారుల దిగ్బంధనం చేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు అనుమానం ఆ లారీ డ్రైవర్ మీదకే మళ్లింది...దీంతో...ఇంకేముంది...గుట్టురట్టయింది!
ప్రకాశం జిల్లా మేదరమెట్ల పోలీసు స్టేషన్కు గురువారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో ఓ లారీ డ్రైవర్ హడావుడిగా వచ్చాడు. తన పేరు రామస్వామి రంగనాథన్ అని, తన లారీని ఎవరో దొంగిలించుకు పోయారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బైంసాలోని బిహార్ హోటల్ వద్ద డ్రైవర్ లారీని ఆపి భోజనానికి వెళ్లి తిరిగివచ్చేసరికి లారీ కనిపించలేదన్నాడు. అందులో రూ. కోట్ల విలువ చేసే సెల్ఫోన్లు ఉన్నాయని చెప్పాడు. అప్పుడు స్టేషన్ లో ఇద్దరే పోలీసులు డ్యూటీలో ఉన్నారు. ఈ ఫిర్యాదు విన్న వెంటనే గుండెలు అదిరిపోయిన పోలీసులు వెంటనే ఎస్సైకి సమాచారమివ్వగా ఆయన తక్షణం రంగంలోకి దిగారు.
ఆ తరువాత సమాచారం అందుకున్న దర్శి డీఎస్పీ నాగేశ్వరరావు, అద్దంకి సీఐ హైమారావు కూడా అప్రమత్తమై దిశానిర్దేశం చేశారు. ఈ లారీ ఆచూకీ కోసం అద్దంకి సర్కిల్ పోలీసులందరినీ రంగంలోకి దించారు. జాతీయ రహదారి, నామ్ రహదారిలోనూ అంతటా తనిఖీలు ప్రారంభించారు. అయితే ఎక్కడా లారీ జాడ మాత్రం తెలియలేదు. అయితే టంగుటూరు టోల్ప్లాజా దాటినట్లు సిసి ఫుటేజ్ ఆధారం ఉంది.
ఆ తరువాత జాతీయ రహదారిలో బైటమంజులూరు, నామ్ రహదారిలో సంతమాగులూరు రహదారుల్లోని టోల్గేట్లు మాత్రం దాటి వెళ్లినట్లు సిసి ఫుటేజ్ లో కనిపించలేదు. దీంతో ఏదో సందేహం వచ్చిన పోలీసులకు ఫిర్యాదు చేసిన లారీ డ్రైవర్పైనే అనుమానం మొదలైంది. మద్యం మత్తులో ఉన్న అతడిని తమదైన శైలిలో విచారించగా అసలు గుట్టు బైటపడింది. ఆ తరువాత అతడు ఇచ్చిన సమాచారం ప్రకారం మేదరమెట్ల సమీపంలోని చిల్లచెట్లలో దాచిఉంచిన లారీ ఆచూకీ లభ్యమైంది. ఆ లారీ డ్రైవర్ రామస్వామినే ఆ లారీ ఓనర్ కూడా అని పోలీసులకు అప్పుడే తెలిసింది.
లారీలోని సెల్ఫోన్లకు భీమా ఉందని తెలుసుకున్న పోలీసులు ఇంత ఖరీదైన లోడుతో వెళుతున్న లారీకి జీపీఎస్ ఏర్పాటు లేకపోవడం అయినా కంపెనీ వారు ఈ లారీని పంపడంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే డ్రైవర్ దురుద్దేశంతో సరకును పక్కదారి పట్టించినా ఆ ఫోన్లన్నింటికీ ఐఎంఈఐ నెంబర్లుంటాయి కనుక, వాటిని విక్రయించడం కష్టసాధ్యం అంటున్నారు పోలీసులు.
ఈ దోపిడీకి తెగబడిన లారీ డ్రైవర్ ఏడో తరగతి కూడా చదవలేదని...కనీసం సంతకం కూడా సరిగ్గా పెట్టలేడని తెలుస్తోంది. అందువల్ల ఈ నాటకంలో ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. ఎస్.ఐ వై.పాండురంగారావు కేసు నమోదు చేశారు. కంపెనీ యాజమాన్య ప్రతినిధులకు సమాచారం ఇచ్చి, వారిని అద్దంకి రావాలని సూచించారు.