ట్యాక్స్పై ఒక్కటైన ఏపీ, టీ లారీ ఓవర్లు: కేసీఆర్ను పాతరేస్తామని రేవంత్
హైదరాబాద్/విజయవాడ: అంతర్రాష్ట్ర పన్నును నిరసిస్తూ ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల లారీ యజమానుల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నాకు దిగారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్టు వద్ద లారీ యజమానులు, డ్రైవర్లు నిరసన చేపట్టారు.
అంతర్ రాష్ట్ర పన్నును వేయవద్దని వారు డిమాండ్ చేశారు. వారు జాతీయ రహదారిపై బైఠాయించారు. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్కు అంతరాయం లేకుండా వారిని అక్కడి నుండి చెదరగొట్టారు. ధర్నా నేపథ్యంలో కొంతసేపు విజయవాడ - హైదరాబాదు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎంట్రీ ట్యాక్స్ పేరిట ప్రభుత్వాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు.
రైతుల్ని రేపు పరామర్శిస్తాం: కిషన్ రెడ్డి
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను తాము రేపు (బుధవారం) పరామర్శిస్తామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి మంగళవారం చెప్పారు. ముగ్గురు కేంద్రమంత్రులు, పార్టీ ప్రతినిధులతో నాలుగు బృందాలు ఎనిమిది జిల్లాల్లో పర్యటిస్తాయన్నారు. రైతు కుటుంబాలకు కేంద్రం ఇచ్చిన తరహాలో రాష్ట్రం కూడా పరిహారం ఇవ్వాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తమ పర్యటన తర్వాత ప్రధఆని మోడీకి నివేదిక ఇస్తామని చెప్పారు.
కేసీఆర్పై రేవంత్ నిప్పులు
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్కు కనిపిపంచడం లేదా అని ప్రశ్నించారు. జూరాల నుంచి పాకాలకు నీటిని తరలిస్తే కేసీఆర్ను జూరాల వద్దే పాతరేస్తామన్నారు.
ఎంపీగా పాలమూరు నుంచి గెలిచిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పాలమూరుకు ఏం చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారని, ఈ విషయం సమగ్ర సర్వేలో కనిపించలేదనా అని నిలదీశారు. మరోవైపు, తెలంగాణ టీడీపీ నేతలు నల్గొండ జిల్లాలో పర్యటించారు. అకాల వర్షంతో నష్టపోయిన పంటలను పరిశీలించారు.