ఉల్లిపాయల లారీని ఎత్తుకెళ్లిన దుండగులు
కాకినాడ: ఉల్లిగడ్డలకు ఉన్న డిమాండ్ తెలిసిందే. మార్కెట్లలో కొరత ఏర్పడడమే కాకుండా ధరలు ఆకాశాన్నంటాయి. ఈ స్థితిలో ఓ ఉల్లిపాయల లారీ దొంగతనానికి గురైంది. ఆ సంఘటన తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన రావులపాడులో బుధవారంనాడు జరిగింది.
ఒడిషాకు చెందిన ఉల్లిపాయల వ్యాపారీ లక్ష్మణ్ బీర మంగళవారంనాడు తాడేపల్లిగూడెంలో 373 సంచుల ఉల్లిపాయలు కొనుగోలు చేశాడు. కర్రి నూకరాజు నుంచి కొన్న ఉల్లిపాయలను లారీలో భువనేశ్వర్కు లారీలో తీసుకుని వెళ్లాలని బయలుదేరాడు.
డ్రైవర్ గంటా రవి తాడేపల్లిగూడెంలో అర్థరాత్రి 12 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంటకు రావులపాడు చేరుకున్నాడు. హోటల్లో భోజనం చేయడానికి లారీని రోడ్డుపక్కన నిలిపాడు. అర గంట తర్వాత బయటకు వచ్చి చూసే సరికి లారీ కనిపించలేదు.
లారీతో పాటు ఉల్లిపాయలు కూడా కనిపించకపోవడం గంటా రవి బిత్తరపోయాడు. దాంతో లారీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.