ప్లాట్లు ఇప్పుడే కాదు: రాజధాని రైతులకు వర్షం చిక్కు, ట్రాక్టర్ నడిపిన బాబు
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన నేలపాడు గ్రామ రైతులకు ప్లాట్ల కేటాయింపు వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా ప్లాట్ల కేటాయింపు వాయిదా పడిందని మంత్రి నారాయణ చెప్పారు.
భూములిచ్చిన రైతులకు ఈ రోజు (సోమవారం) నుంచి ప్లాట్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. తొలుత నేలపాడు గ్రామ పరిధిలో ఈ రోజు సాయంత్రం కేటాయింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
షెడ్యూలులో లేనప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారా ప్లాట్ల కేటాయింపు ప్రారంభించాలనుకున్నారు. కానీ ఈ రోజు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కేటాయింపు వాయిదా పడింది. దీనిపై నారాయణ మాట్లాడుతూ... వర్షాల కారణంగా వాయిదా పడిందని చెప్పారు.
అమరావతి రైతులకు లాటరీ పద్ధతిలో ప్లాట్లు, రాజధానిలో బ్రిక్స్ పార్క్
రైతులకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్లాట్ల కేటాయింపు తదుపరి తేదీని తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. రైతులకు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తేదీని ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
తుళ్లూరు నుంచి ప్రారంభిద్దామనుకున్నప్పటికీ అక్కడ కూడా వర్షం పడుతుండటంతో వాయిదా పడింది. కాగా, తమకు ఎక్కడ ప్లాట్లు కేటాయిస్తారో తెలుసుకునేందుకు ఎదురు చూసిన రైతులు మంత్రి నారాయణ ప్రకటనతో అసంతృప్తికి లోనయ్యారు.
ట్రాక్టర్ నడిపి, నాట్లు వేసిన చంద్రబాబు
పశ్చిమ గోదావరి జిల్లా చిట్టవరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్రాక్టర్ నడిపి, నాట్లు వేశారు.
మరోవైపు, వర్షాల కారణంగా చంద్రబాబు ఏరువాక కార్యక్రమానికి ఒకింత ఇబ్బంది ఎదురైంది. అధికారులు ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం బురదమయంగా మారింది. వచ్చిన వారు కూర్చునేందుకు స్థలం లేకుండా పోయింది. చంద్రబాబు రాకముందే చాలామంది వచ్చారు.