ట్రిపుల్ ఐటి విద్యార్థిని భారతి ఆత్మహత్య: ప్రేమ వ్యవహారమే కారణమా?
కడప: ట్రిపుల్ ఐటి విద్యార్థిని వడ్డె భారతి (21) ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చారు. సెల్ఫోన్ మెసేజ్ ఆధారంగా వారు ఆ నిర్ధారణకు వచ్చారు. కడప జిల్లా పులివెందుల ట్రిపుల్ ఐటిలో నాలుగవ సంవత్సరం చదువుతున్న వడ్డె భారతి పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
హాస్టల్ గదిలో పోలీసులు సెల్ఫోన్ను, సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విష్ యూ హ్యాపీ బర్త్ డే... కనురెప్పలు కలుసుకోవాలని కలవరపడుతున్నాయి... కనుమరుగై నీ రూపాన్ని కనుపాపకు చూపాలని నా ప్రయత్నం.. ఈ ప్రయాణం నీ కోసం (ఆర్)... అనే మెసేజ్ డ్రాఫ్ట్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారని అంటున్నారు.
పులివెందుల రూరల్ సిఐ మహేశ్వర రెడ్డి, ఎస్ఐ ప్రదీప్ నాయుడు ట్రిపుల్ ఐటిలోని భారతి ఉండే 72వ గదిని పరిశీలించారు. ఆమె వాడిన సెల్ఫోన్ను, విషం సీసాను స్వాధీనం చేసుకున్నారు. ఓ పుస్తకంలో రాసి ఉన్న సూసైడ్ నోటును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
"ఈ ఆఖరి క్షణంలో ఏమి రాయాలో అర్థం కావడం లేదు. నాన్నా.. నా చేతులు వణుకుతున్నాయి... మీ ఆశలను, నమ్మకాలను చంపేసి వెళుతున్నందుకు నన్ను క్షమించండి.. అమ్మా... నీకు కడుపు కోత పెట్టిస్తున్నందుకు క్షమించమ్మా.. నా వల్ల ఎవరూ బాధపడటం నాకు ఇష్టం లేదు.. అందుకే ఇలా చేస్తున్నా..." అంటూ సూసైడ్ నోటులో రాసింది.
కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం హనుమతుగుండం గ్రామానికి చెందిన మద్దిలేటి, అలివేలమ్మ మూడో కూతురు వడ్డె భారతి. తండ్రి బేల్దార్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పులివెందుల ట్రిపుల్ ఐటిలో భారతి కంప్యూటర్ సైన్స్ నాలుగో సంవత్సరం చదువుతోంది. ట్రిపుల్ ఐటి హాస్టల్లో విషం తాగిన భారతిని హుటాహుటిన కడపలోని రిమ్స్కు తరలించారు. అయితే, అప్పటికే ఆమె ప్రాణాలు గాలిలో కలిశాయి.