ప్రాణాల మీదకు తెస్తున్న ప్రేమ వ్యవహారాలు:రాజధాని జిల్లాల్లో కలకలం
అమరావతి:ప్రేమ వ్యవహారాలే ప్రాణం మీదకు తెచ్చిన ఘటనలు రాజధాని జిల్లాల్లో వరుసగా వెలుగు చూడటం కలకలం సృష్టిస్తోంది. లవ్ ఎఫైర్ నేపధ్యంలో కృష్ణా జిల్లాలో ఓ బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి వద్ద లభ్యమైన సూసైడ్ నోట్ ను బట్టి ప్రేమ వ్యవహారమే అందుకు కారణంగా తెలిసింది.
మరోవైపు గుంటూరు జిల్లాలో తమ ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న వీరిని కాపాడేందుకు చికిత్స జరుగుతోంది. మరోవైపు తన సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో స్నేహితుడిపైనే కత్తితో దాడి చేశాడో యువకుడు. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో చోటుచేసుకుంది.
బిటెక్ విద్యార్థిని...ఆత్మహత్య
కృష్ణా జిల్లా పునాదిపాడులోని బీసీ కాలనీలో చెందిన లోయా శ్రీమన్నారాయణ అనే వ్యక్తి తన కుమార్తె లోయా రాణి (24), కుమారుడుతో నివాసం ఉంటున్నాడు. శ్రీమన్నారాయణ భార్య సుమారు 20 ఏళ్ల క్రితమే మృతి చెందింది. శ్రీమన్నారాయణ చెరకు కట్టుడుకు, కుమారుడు తాపీ పనికి వెళ్తారు. ఒక్కగానొక్క కుమార్తెను ఉన్నత చదువులు చదివించాలన్న సంకల్పంతో మైలవరంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేయించారు. ప్రస్తుతం ఉద్యోగ వేటలో ఉన్న ఆమె ఉన్నట్టుండి శనివారం ఇంట్లోనే చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోయేముందు ఆమె రాసిన సూసైడ్ నోట్ అనంతరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అధ్యాపకుడే...అజ్ఞాత ప్రేమికుడు
తనను ఓ వ్యక్తి ప్రేమించి మోసం చేశాడని, అతని వల్లే తాను బలవన్మరణానికి పాల్పడున్నట్లు లోయా రాణి సూసైడ్ నోట్లో ఉండటంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. గతంలో విజయవాడలోని ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న సమయంలో ఈమె ప్రేమించిన వ్యక్తిగా అనుమానిస్తున్న ఒక అధ్యాపకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ విషయమై పోలీసులు వివరాలు వెల్లడించలేదు. ప్రేమ వ్యవహారమే రాణి ఆత్మహత్యకు కారణమా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ?...అన్నదానిపై కూడా పోలీసులు ఈ ఇరువురి ఫోన్ కాల్ డేటాను క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
ప్రేమజంట...ఆత్మహత్యాయత్నం
వినుకొండ పట్టణానికి చెందిన షహనాజ్, కరీముల్లా అనే ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. పెళ్లి విషయంపై పెద్దల సమక్షంలో చర్చలు జరిగినా అవి విఫలమవడంతో తొలుత షహనాజ్ ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో హుటాహుటిన ఆమెని ఆస్పత్రికి తరలించారు. ఇది తెలిసిన ప్రేమికుడు కరీముల్లా కూడా పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు గమనించి అతడిని కూడా చికిత్స నిమిత్తం అదే ఆసుపత్రికి తరలించారు.
స్నేహితుడిపై...కత్తితో దాడి
గన్నవరంకు చెందిన ఆటోడ్రైవర్లు కట్టా పరశురాం, పరసా విజయకృష్ణ స్నేహితులు. అయితే తన సోదరితో పరశురాం వివాహేతర సంబంధం నడుపుతున్నాడని విజయకృష్ణకు అనుమానం వచ్చింది. ఇదే విషయమై పరశురాంను విజయకృష్ణ హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయినా పరశురాం తేలికగా తీసుకోవడంతో శుక్రవారం రాత్రి పరశురాంపై విజయకృష్ణ కత్తితో దాడి చేయగా పరశురాం తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.