శేషాచలం అడవిలో తప్పిపోయిన ప్రేమజంట: పోలీసుల విస్తృత గాలింపు
కడప: ఇటీవల అదృశ్యమైన కడప జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అటవీప్రాంతంలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో చదువుకునే సౌందర్య, నవీన్లు శేషాచలం అడవుల్లో తప్పిపోయిన విషయం తెలిసిందే.
కళాశాలలో పీయూసీ రెండో సంవత్సరం చదువుకుంటున్న ఇద్దరు విద్యార్ధులు శనివారం నుంచి కనిపించకుండా పోయారు. ప్రకాశం జిల్లాకు చెందిన సౌందర్య, చిత్తూరు జిల్లాకు చెందిన నవీన్ సోమవారం కళాశాలకు రాకపోవడంతో వీరి అదృశ్యం విషయాన్ని ట్రిపుల్ ఐటీ నిర్వాహకులు కుటుంబసభ్యులకు తెలిపారు.
వీరిద్దరి మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, శేషాచలం అడవుల్లో చిక్కుకున్నామని, దారి తెలియక ఇబ్బందులు పడుతున్నామంటూ వారు సోమవారం సాయంత్రం కుటుంబసభ్యులకు ఫోన్లో సమాచారమిచ్చారు.
ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి సెల్ సిగ్నల్స్ ఆధారంగా వారున్న ప్రాంతాన్ని గుర్తించారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.