రైలులో ప్రేమ పుట్టింది: గర్భం దాల్చడంతో ముఖం చాటేశాడు, చివరకు..
శ్రీకాకుళం: వారిద్దరికి రైలు ప్రయాణంలో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆమె గర్భవతి కావడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. గర్భం తీసేయాలంటూ ఆమెపై ఒత్తిడి చేశాడా దుర్మార్గుడు. దీనికి ఆమె అంగీకరించకపోవడంతో కులాన్ని సాకుగా చూపుతూ ఆమెకు ముఖం చాటేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
రైలు ప్రయాణంలో పరిచయం..
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్కలి మండలం నౌపడ ఆర్ఎస్ గ్రామానికి చెందిన ముడాదాన ప్రమీల ఒక రోజు రైలులో కోచింగ్ నిమిత్తం విజయనగరం వెళుతోంది. అదే రైలులో ప్రయాణిస్తున్న వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడ గ్రామానికి చెందిన కొంకి వెంకటేష్తో ఆమెకు పరిచయం ఏర్పడింది.
ప్రేమిస్తున్నానంటూ..
కాగా, వెంకటేష్ తన ఆర్ఆర్బీ కోచింగ్ సెంటర్కు సంబంధించిన ఐడీ కార్డును ఆమె వద్ద వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆ కార్డు అతడికి అవసరమవుతుందని దానిపై ఉన్న ఫోన్ నెంబర్కు ఫోన్ చేసింది. అయితే, తాను కావాలనే ఐడీ కార్డు వదిలివెళ్లానని.. ప్రేమిస్తున్నానని ఆమెకు చెప్పాడు వెంకటేష్. రాజమండ్రిలో ఉన్నందున ఐడీ కార్డు కోసం తర్వాత వస్తానని చెప్పాడు.
శారీరకంగా దగ్గరయ్యారు.. గర్భందాల్చడంతో పెళ్లి..
ఈ క్రమంలో ప్రమీలకు వెంకటేష్ రోజూ ఫోన్ చేస్తుండేవాడు. కాగా, నెల రోజుల తర్వాత ప్రమీల కూడా రాజమండ్రి బీఈడీ కోచింగ్ సెంటర్కు వెళ్లింది. తరచూ కలుసుకోవడంతో వీరిద్దరిమధ్యసాన్నిహిత్యం పెరిగింది. ఆ సాన్నిహిత్యం వారిని శారీరకంగా దగ్గర చేసింది. దీంతో ఆమె గర్భవతి అయ్యింది. ఈ విషయం అతనికి చెప్పింది. ఆ తర్వాత మార్చి 4న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం చర్చిలో పెళ్లి చేసుకున్నారు.
Recommended Video
చివరకు కులం పేరుతో..
15 రోజులపాటు కాపురం చేసిన వెంకటేశ్.. ఆ తర్వాత తన తండ్రి కరువులు దగ్గరకు వెళ్లాడు. ఆమెను గర్భం తొలగించుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. ఇందుకు ఆమె తిరస్కరించడంతో ఆమెను ముఖం చాటేశాడు. అంతేగాక, తక్కువ కులం దానివంటూ ఆమెను దూరం పెట్టాడు. దీంతో బాధితురాలు తన తల్లితో కలిసి టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.