మరొకరితో ప్రేయసి పెళ్లి: బిటెక్ గ్రాడ్యుయేట్ ఆత్మహత్య
విజయవాడ: తాను ప్రేమించిన యువతి మరొకరిని పెళ్లి చేసుకోవడంతో తట్టుకోలేని బిటెక్ గ్రాడ్యుయేట్ ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం తాను పనిచేసే అరండల్పేట కార్యాలయంలో 24 ఏళ్ల బండారు నాగకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు.
అతను ఆత్మహత్య చేసుకునే సమయానికి అతని ప్రేయసి వివాహానంత వేడుకలకు సిద్ధమవుతోంది. తాను పని చేస్తున్న ఆటోమొబైల్ విడిభాగాల దుకాణంలో కేబుల్ వైర్తో ఉరేసుకుని నాగకృష్ణ మరణించాడు.
ఇరు కుటుంబాల అంగీకారంతో నాగకృష్ణకు డిసెంబర్ 5వ తేదీన ప్రేయసితో నిశ్చితార్థం జరిగిందని, జనవరిలో నాగకృష్ణ తాత మరణించడంతో పెళ్లిని ఫిబ్రవరి నెలకు వాయిదా వేసుకోవాలని నాగకృష్ణ కుటుంబ సభ్యులు భావించారని పోలీసులు చెప్పారు. అయితే, అమ్మాయి కుటుంబ సభ్యులు వినకుండా వేరే సంబంధం కోసం వేట ప్రారంభించారు.
వారం క్రితం నాగకృష్ణ తన ప్రేయసి ఇంటికి వెళ్లి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దని బతిమిలాడాడు. అయితే, ఆమె తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. పైగా, వారు నాగకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ అమ్మాయి ఏప్రిల్ 21వ తేదీన మరో వ్యక్తిని పెళ్లాడింది. శుక్రవారం రిసెప్షెన్ జరగాల్సి ఉండింది. దాంతో మనస్తాపానికి గురైన నాగకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. నాగకృష్ణ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నూజివీడు ఇంజనీరింగ్ కాలేజీలో నాగకృష్ణ బిటెక్ చదివాడు.