టెక్కీ సూసైడ్ కేసులో ప్రియుడి అరెస్ట్, బిల్డింగ్ పైనుండి..
హైదరాబాద్: ప్రేమించిన వాడు పెళ్లికి అంగీకరించలేదని ఓ సాఫ్టువేర్ యువతి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన కేసులో ప్రేమికుడిని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా టౌన్ మోతీనగర్కు చెందిన ప్రియాంక హైదరాబాదులోని ఎస్సార్ నగర్లో ఉంటూ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.
ఆమెకు వరంగల్ జిల్లాకు చెందిన రాహుల్తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. అయితే రాహుల్ మరో యువతిని వివాహం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్న ప్రియాంక అతడిని నిలదీసింది. ఆమె ఈ ఏడాది ఏప్రిల్ 23న సంజీవయ్య పార్కు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్ ఆధారంగా రాహుల్ను పోలీసులు అరెస్టు చేశారు.
భవనం పైనుండి దూకిన యువతి
హైదరాబాదులోని ఫిలింనగర్లో నిర్మాణంలో ఉన్న నాలుగంతస్తుల భవనం పైనుండి దూకి ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
అయితే పైనుండి దూకిన ఆమె ఇసుకలో పడటంతో ప్రాణాపాయం నుండి బయటపడింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె పేరు రేఖ. ప్రేమించిన యువకిడితో పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించక పోవడంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా ప్రాథమిక దర్యాఫ్తులో తేలిందని పోలీసులు తెలిపారు.