తెగించిన ప్రేమోన్మాది: రాత్రి10గం.కు ఆమె గదికి వెళ్లి.. కత్తితో విచక్షణారహితంగా!
గన్నవరం: మరో ప్రేమోన్మాది బరితెగించాడు. తనతో మాట్లాడటం లేదన్న కారణంతో ప్రేమించిన యువతిపై కత్తితో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఇటీవలే తమ ప్రేమ గురించి పెద్దలకు తెలపగా వీరికి నిరాశే ఎదురైనట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా యువకుడితో ఆమె మాట్లాడటం లేదు. దీంతో యువతిపై కక్ష పెంచుకున్న యువకుడు నేరుగా ఆమె గదికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
ఎవరీ ప్రేమ జంట?:
ఒడిశా రాష్ట్రంలోని భద్రాక్ జిల్లా బగానా గ్రామానికి చెందిన కమల కాంత్ నాయక్ (23), అదే జిల్లాలోని సుందర్పూర్ గ్రామానికి చెందిన రింకీరాణి (20) బాపులపాడు మండలం రేమల్లె గ్రామంలోని ఓ స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్నారు. కంపెనీ క్వార్టర్స్ లోనే నివాసముంటున్నారు.
ప్రేమకు దారితీసింది:
రెండేళ్ల నుంచి ఒకే స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తుండటం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. పైగా ఇద్దరిది ఒకే ప్రాంతం, ఒకే కులం కావడంతో.. పెద్దలు సైతం తమ ప్రేమను ఒప్పుకుంటున్నారని భావించారు.
కానీ అలా జరగలేదు:
తమ ప్రేమకు పెద్దల అంగీకారం లభిస్తుందనుకున్న నాయక్, రింకీరాణిలకు ఊహించని పరిస్థితి ఎదురైంది. 15 రోజుల క్రితం రింకీరాణి స్వగ్రామానికి వెళ్లిన సందర్భంగా.. కమల కాంత్ నాయక్ కుటుంబ సభ్యులు ఆమె ఇంటికి వెళ్లి పెళ్లి సంబంధంపై మాట్లాడారు. అయితే పెళ్లిపై ఇరు కుటుంబాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వీరికి నిరాశ ఎదురైంది.
రాణి మాట్లాడట్లేదని:
ఇరు కుటుంబాల్లో పెళ్లిపై బేధాభిప్రాయాలు వచ్చిన తర్వాత.. నాయక్ తో రాణి మాట్లాడటం మానేసింది. దీంతో ఆమెపై నాయక్ కక్ష పెంచుకున్నాడు. ఆగ్రహంతో రగిలిపోతూ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో కంపెనీ క్వార్టర్స్ లోని రాణి గదికి వెళ్లాడు. ఆ సమయంలో రాణి స్నేహితులతో ఉండగా.. నీతో మాట్లాడాలని నాయక్ అన్నాడు.
అయితే రాణి మాత్రం అందుకు నిరాకరించడంతో అకస్మాత్తుగా కత్తితో ఆమెపై దాడి చేశాడు. దాడిలో రింకీరాణి మెడ, నడుం భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన చిన్న ఆవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ వైద్యశాలకు తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసినట్లు వీరవల్లి ఎస్ఐ నాగ దుర్గారావు తెలిపారు. ప్రస్తుతం నాయక్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.