హిందూ-ముస్లిం పెళ్లి!: అమ్మాయిని లాక్కెళ్లారు.. యువకుడి ఆత్మహత్యాయత్నం!
ఇబ్రహీం-శశిరేఖ నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లోనే ఉంటున్నారని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు.. ఇటీవల ఆమెను బలవంతంగా తీసుకెళ్లిపోయారు.
తిరుపతి: ప్రేమ పెళ్లి చేసుకోవడం ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడంతో అమ్మాయి తరుపు వారి నుంచి వ్యతిరేకత ఎదురైంది. పెళ్లయ్యాక భార్యను బలవంతంగా లాక్కుపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన యువకుడు అత్తవారింటి ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి నగరం గాంధీపురానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ మౌలానా ఆజా కుమారుడు ఇబ్రహీం(28) నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనస్థీషియా టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. అదే ఆసుపత్రిలో పాతకాల్వకు చెందిన టీటీడీ ఉద్యోగి మోహన్ రెడ్డి, భారతిల కుమార్తె శశిరేఖ బీఎస్సీ నర్సుగా పనిచేస్తోంది.
ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇంతలో ఇబ్రహీం దుబాయ్ లోని అబుదాబిలో ఉద్యోగం కోసం వెళ్లాడు. ఇటీవల ఇబ్రహీంకు ఫోన్ చేసిన శశిరేఖ.. పెళ్లి చేసుకుందామని అతన్ని కోరింది. దీంతో గత నెల 29న అతను ఇండియా తిరిగొచ్చాడు.
అనుకున్నట్లుగానే జులై 6న ముస్లిం సాంప్రదాయ పద్దతిలో కడపలోని ప్రభుత్వ ఖాజీ ఆధ్వర్యంలో పెళ్లి చేసుకున్నారు. ఆ రోజు రాత్రి తిరుపతిలోని ఒక హోటల్లో బస చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకు తమ ఇంటికి వెళ్లిన శశిరేఖ.. తిరిగి 9న ఇబ్రహీం వద్దకు వచ్చింది.
ఇబ్రహీం-శశిరేఖ నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లోనే ఉంటున్నారని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు.. ఇటీవల ఆమెను బలవంతంగా తీసుకెళ్లిపోయారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఇబ్రహీం.. ఆత్మహత్యకు యత్నించి తిరిగి కోలుకున్నాడు.
శుక్రవారం రోజు శశిరేఖ తల్లిదండ్రుల ఇంటి వద్దకు వెళ్లాడు. సాయంత్రం 4గం. సమయంలో వారి ఇంటి ఎదుటే ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో శశిరేఖకు వరుసకు చిన్నాయన అయ్యే పాతకాల్వ ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, మరికొందరు కలిసి ఇబ్రహీంను చితకబాది ఊరవతలి చెట్టు కింద పడేశారు.
విషయం తెలుసుకున్న బాధితుడి చిన్నాన్న హిరానా సాహెబ్, సోదరుడు ఖాదర్ వల్లి అక్కడికి చేరుకుని ఇబ్రహీంను రుయా ఆసుపత్రికి తరలించారు. ఇబ్రహీం సోదరుడైన నాగూర్ బాషాను అమ్మాయి బంధువులు బంధించినట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ వ్యవహారంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎంఆర్ పల్లి పోలీసులు తెలపడం గమనార్హం.