అల్పపీడనం ఎడాపెడా: బంగాళాఖాతంలో మరొకటి: వాయుగుండంగా మారే ఛాన్స్?
విశాఖపట్నం: కొద్దిరోజులుగా అటు బంగాళాఖాతం, ఇటు అరేబియా సముద్రంలో ఒకదాని వెంట ఒకటి అన్నట్టుగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఇదివరకు బంగాళాఖాతంలో ఆంఫన్ తుఫాన్ ఏ రేంజ్లో బీభత్సాన్ని సృష్టించిందో చూశాం. దాని ప్రభావం సద్దు మణిగిన వెంటనే- అరేబియా సముద్రంలో నిసర్గ తుఫాన్ ఏర్పడింది. మహారాష్ట్రపై దాడి చేసింది. నిసర్గ.. నిష్క్రమించిన కొద్దిరోజుల్లోనే మళ్లీ బంగాళాఖాతం వంతు వచ్చింది.
Recommended Video
తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరి కొన్ని గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖపట్నంలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఇది వాయవ్య దిశగా కదులుతోందని, మరో 24 గంటల్లో బలపడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. క్రమంగా అది వాయుగుండంగా మారే అవకాశాలు లేకపోలేదని అంచనా వేశారు. ఈ అల్ప పీడనం ప్రభావంతో ఈ నెల 12వ తేదీ వరకు ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు.
అలాగే- రాయలసీమలో పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదవుతుందని అన్నారు. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అల్పపీడనం ప్రభావం వల్ల ఒడిశా, తెలంగాణతో పాటు మహారాష్ట్రలోని విధర్భ ప్రాంతాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురవడానికి ఆస్కారం ఉందని తెలిపారు. అదే సమయంలో నైరుతి రుతు పవనాలు కూడా విస్తరిస్తున్నందున ఛత్తీస్ఘడ్, దక్షిణ మధ్య ప్రదేశ్లో జూన్ 11 నుంచి 13 వరకు వర్షం పడుతుందని తెలిపారు.
అల్పపీడనం ప్రభావం వల్ల కోస్తా తీరం వెంబడి 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని విశాఖ తుపాన్ హెచ్చరికలు కేంద్రం హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాగా, నైరుతి రుతు పవనాల ప్రభావం వల్ల కర్ణాటక, తమిళనాడుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, వచ్చే 48 గంటల్లో మహారాష్ట్ర, కర్ణాటక, రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తాయని తెలిపారు. కర్ణాటక తీర ప్రాంత జిల్లాలు, కేరళ ఉత్తర ప్రాంత జిల్లాల్లో ఇదివరకే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయని అన్నారు. మున్ముందు మరింత విస్తారంగా వర్షం పడుతుందని తెలిపారు. రాయలసీమ, దక్షిణ తెలంగాణ జిల్లాలకు వర్షసూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.