ఏపీలో దంచికొడుతున్న వానలు... పొంగిపొర్లుతున్న వాగులు,వంకలు... మరో 3 రోజులు...
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వాగులు,వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్నిచోట్ల రోడ్ల పైకి వరద నీరు చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అల్పపీడన ప్రభావంతో ఈ నెల 17వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేకాదు,ఈ నెల 20న మరో అల్పపడీనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
Recommended Video
ఏయే జిల్లాల్లో...
ఉత్తరాంధ్ర తీరంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడు అదే ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో తూర్పుగోదావరి, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు గోదావరిలో భారీ వర్షాలకు వరద నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. జిల్లాలోని పెద్దాపురం మండలం కాండ్రకోటలో ఆదివారం(సెప్టెంబర్ 13) పిడుగు పడి ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. అటు అమలాపురంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రతిపాడు జలశాయం నిండటంతో నీటిని కిందికి విడిచిపెడుతున్నారు.
అనంత,గుంటూరు జిల్లాల్లో...
అనంతపురం జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఉరవకొండ నియోజకవర్గంలో ఆదివారం(సెప్టెంబర్ 13) రాత్రి కురిసిన భారీ వర్షానికి అక్కడి చెరువు పొంగిపొర్లుతోంది. వజ్ర కరూరు,విడపనకల్లు మండలాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు జిల్లాలోనూ చాలాచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రత్తిపాడు,కాకుమాను,పెదనందిపాడు,వట్టి చెరుకూరుల్లో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. అకాల వర్షాలతో మిర్చి,పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు.
పొంగొపొర్లుతున్న వాగులు,వంకలు
కృష్ణా జిల్లాలో భారీ వర్షాలకు వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. గంపలగూడెంలో కట్టలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చాట్రాయి మండలం చిన్నంపేటలో తమ్మిలేరు వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతికి శివాపురం,చిన్నంపేట మధ్య వంతెన తెగిపోవడంతో కృష్ణా,పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. తమ్మిలేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తడటంతో అధికారులు నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.
లోతట్టు ప్రాంతాల్లో అలర్ట్...
భారీ వర్షాలకు నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టుకు నీటి ఉధృతి పెరిగింది. దీంతో దాదాపు 12వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇక విశాఖపట్నం జిల్లాలోని నాతవరం మండలం తాండవ ప్రాజెక్ట్ వద్ద వరద ప్రమాద స్థాయికి చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లాలోని బొండపల్లి మండలం గెద్దపేటలో భారీ వర్షాలకు మట్టిగోడ కూలి ఓ వృద్దురాలు చనిపోయింది.
17 వరకు భారీ వర్షాలు
రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోటలో 21.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్రలో 19.1, కర్నూలు జిల్లా ఆత్మకూరులో 18.7, బ్రహ్మంగారి మఠంలో 10.9, అనంతపురం జిల్లా యాడికిలో 9.9 సెం.మీ వర్షం పడింది. అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉండటంతో ఉభయగోదావరి,కృష్ణా జిల్లాలతో పాటు రాయలసీమలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ నెల 17 వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు.