ఏపీకి పొంచివున్న అకాల గండం: బంగాళాఖాతంలో అల్పపీడనం: 24 గంటల్లో తుఫానుగా
విశాఖపట్నం: కరోనా వైరస్ ఒకవంక రాష్ట్రాన్ని గడగడలాడిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అకాల వర్షాలు గండం పొంచివుంది. అండమాన్ సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 24 గంటల వ్యవధిలో తుఫానుగా మార్చు చెందే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నంలోని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. క్రమంగా అది తుఫానుగా రూపాంతరం చెందే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా- కోస్తాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుందని చెబుతున్నారు.
Recommended Video
అల్పపీడనం ప్రభావం వల్లేనేమో తెలియట్లేదు గానీ విశాఖపట్నం సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిశాయి. శుక్ర, శనివారాల్లో విశాఖపట్నంలో భారీగా వర్షం కురిసింది. కడప, చిత్తూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. తిరుమలలో భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురిశాయి. ఫలితంగా కపిలతీర్థం, మాల్వాడి గుండం పొంగిపొర్లాయి. శ్రీవారి ఆలయం ముందు మోకాలి లోతు మేర వర్షపు నీరు చేరుకుంది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావం వల్ల అకాల వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
తాజాగా- బంగాళాఖాతంలో అండమాన్ దక్షిణ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని, 24 గంటల్లో అంటే.. సోమవారం సాయంత్రానికి తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావం ఏపీ, ఒడిశా, తమిళనాడులపై తీవ్రంగా ఉండొచ్చని అంచనా వేశారు. చెన్నై సహా మన రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని చెబుతున్నారు. ప్రత్యేకించి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలపై దీని ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఈ అల్పపీడనం ప్రభావం వల్ల తీర ప్రాంతాల్ల ఈదురుగాలులు వీస్తాయని, కెరటాలు సాధారణ రోజుల కంటే ఎక్కువ ఎత్తు వరకు ఎగిసిపడతాయని అభిప్రాయపడుతున్నారు. వాటిని అకాల వర్షాలుగానే భావించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే విశాఖపట్నం సహా పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయి. వాటి నుంచి కోలుకోక ముందే.. ఈ అల్పపీడనం పొంచివుండటం వల్ల రైతాంగానికి మరింత నష్టం సంభవించే అవకాశాలు లేకపోలేదనే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.