జగన్ పార్టీకి 'లక్కీ' డ్రా: నెల్లూరు జెడ్పీ చైర్మన్, వైస్ వశం
నెల్లూరు: నెల్లూరు జెడ్పీ చైర్మన్ పదవిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుచుకుంది. లక్కీ డిప్ ద్వారా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రావు ఎన్నికైనట్లు ప్రకటించారు. జెడ్పీ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి.
నెల్లూరులో 46 జెడ్పీటీసీలు ఉన్నారు. 31 మంది వైయస్సార్ కాంగ్రెసు, 15 మంది తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీలు గెలిచారు. ఇక్కడి జెడ్పీ పీఠాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సునాయాసంగా గెలుచుకోవాల్సి ఉంది. అయితే, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పలువురు జగన్ పార్టీ జెడ్పీటీసీలు టీడీపీ వైపు మొగ్గు చూపారు.
దీంతో జెడ్పీ చైర్మన్ ఎన్నిక రెండుసార్లు వాయిదా పడింది. ఇప్పుడు మూడోసారి ఎట్టకేలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన రాఘవేంద్ర రావు లక్కీ డిప్ ద్వారా గెలుపొందారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 31 సభ్యులలో ఎనిమిది మంది టీడీపీకీ మద్దతు తెలిపారు. దీంతో ఇరు పార్టీల బలం 23తో సమానంగా ఉంది. ఇరు పార్టీల బలం సమానంగా ఉండటంతో లక్కీ డిప్ ద్వారా జెడ్పీ చైర్మన్ను ప్రకటించారు. ఇందులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిని అదృష్టం వరించింది. వైస్ చైర్మన్ పదవి కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీనే వరించింది.