ఎంటెక్ చదివి ఏం చేశాడో చూడండి!...ఆ పాడు పనితో లక్షలు సంపాదించాడు:చివరకు ఇలా దొరికేశాడు
గుంటూరు:అనగనగా ఒక అబ్బాయి...అతడికి డేటింగ్ చేయాలనిపించింది...ఇంకేముంది...ఉందిగా ఆన్ లైన్ అనుకుంటూ అందులో అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారో సెర్చ్ చేశాడు. అలా సెర్చింగ్ చేశాక లోకల్ అమ్మాయిలు కావాలంటే లోకాన్టో బెటరని అందులో అన్వేషణ మొదలు పెట్టాడు.
అక్కడ కనిపించే ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని ఫోన్ చేశాడు. అవతల వైపు లిఫ్ట్ చేసింది అమ్మాయి కాదు మరో వ్యక్తి...సరే అమ్మాయిని పంపిస్తాను...ఈ అకౌంట్ కి నువ్వు డబ్బులు పంపించమన్నాడు. ఆ తరువాత డబ్బులు అతడి అకౌంట్ లోకి వెళ్లాయి...కానీ అమ్మాయి రాలేదు...మళ్లీ అవతలి వ్యక్తి కోసం కాల్ చేస్తే ఫోన్ స్విచ్డ్ ఆఫ్. అలా మోసపోయిన వ్యక్తుల్లో అతడి నంబర్ 508...అయితే అందరిలా అతడు ఊరుకోలేదు...తన తెలివితేటలతో ఆ వ్యక్తిని పోలీసులకు పట్టిచ్చాడు...అలా దొరికిపోయిన ఆ నిందితుడే సుమన్ రెడ్డి ఎంటెక్.
ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో గోపాలునిపల్లె గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ కొడుకు వీరంరెడ్డి మోహన్రెడ్డి కుమారుడు వీరంరెడ్డి సుమన్రెడ్డి. ఇతడు 2013లో ఎంటెక్ పూర్తి చేశాడు. ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేసినా సరైన ఉద్యోగం దొరకలేదు. ఈ క్రమంలోనే ఇతడు 6 నెలల క్రితం అమ్మాయితో డేటింగ్ చేయాలని ఆన్లైన్లో రూ.60 వేలు కట్టి మోసపోయాడు. ఆ తరువాత అతడికి ఓ ఐడియా వచ్చింది. తానేవిధంగా మోసపోయానో అలాగే డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.
అలా అనుకుని పథకం ప్రారంభించాడో లేదో...దాంతో లోకాన్టో అనే వెబ్ సైట్ లో అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టడం...వారి కోసం కాల్ చేసే వారికి అమ్మాయిని పంపిస్తాను డబ్బులు అకౌంట్లో వేయమనడం...ఆ తరువాత ఫోన్ స్విచ్డ్ ఆఫ్ చేయడం...ఇలా అతడు ఎంతమందిని మోసగించాడో తెలుసా...507 మంది...వారి ద్వారా ఎంత డబ్బు సంపాదించాడో అదీ తెలుసుకోండి...రూ. 21.58 లక్షలు. ఇంకో విచిత్రం ఏమిటంటే...ఇలా మోసపోయిన 507 మందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా తాము మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం. అయితే ప్రతి పాపం ఎప్పుడో పండుతుందన్నట్లే...508 వ్యక్తి ని మోసగించడం తో ఇతడి అక్రమార్జనకు ముగింపు పడింది. అదెలాగంటే...
గుంటూరుకు చెందిన పాముల జగదీష్ అనే యువకుడు అమ్మాయి కోసం లోకాన్టోలో చూసి సుమన్ రెడ్డికి రూ. 19500 డబ్బులు వేయగా... అతడు అమ్మాయిని పంపించలేదు. తాను మోసపోయానని తెలుసుకున్న జగదీష్ గుంటూరు నగరంలోని నగరంపాలెం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నిఘా వేసిన పోలీసులు జగదీష్ చెప్పిన వివరాల ప్రకారం అమ్మాయిలు కావాలని ఆన్లైన్లో సుమన్రెడ్డిని సంప్రదించి...అలా వలపన్ని పట్టుకున్నారు. అతని వద్ద రూ.8 లక్షల నగదును, కారు, ల్యాప్టాప్, 3 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వార్త కొమరోలు మండలంలో చర్చనీయాంశమైంది.