నరకం చూపిన ప్రయాణం: తిరిగొచ్చిన అండమాన్ నౌక(పిక్చర్స్)
విశాఖపట్నం: విశాఖ ఓడరేవు నుంచి అండమాన్-నికోబార్ దీవులకు బయలుదేరిన హర్షవర్ధన నౌక ప్రయాణికులకు నరకం చూపించింది. సాంకేతిక లోపంలో నిలిచిపోయిన నౌకలో దాదాపు రెండున్నర రోజుల అష్టకష్టాలు పడ్డారు. భోజనం, నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డారు. విశాఖలోని జెట్టీకి బుధవారం అర్ధరాత్రి దాటాక సుమారు 2 గంటల సమయానికి నౌక చేరుకుంది.
గురువారం ఉదయం సాంకేతిక సిబ్బంది వచ్చి పరీక్షించి, నౌక బాగవ్వాలంటే రెండు రోజులు పడుతుందని తేల్చారు. దీంతో ప్రయాణికులను ఇళ్లకు పంపేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
గురువారం సాయంత్రం 5 గంటలకు నౌక నుంచి ప్రయాణికులను దించివేశారు. వారి టిక్కెట్లు డబ్బులను తిరిగి ఇచ్చేశారు. ఇలా సముద్రంపై 52 గంటల గడిపి చివరకు అండమాన్ వెళ్లకుండానే ప్రయాణికులు నిరాశతో ఇళ్లకు తిరుగుముఖం పట్టారు.
సాంకేతిక లోపం
షిప్పింగ్ కార్పొరేషన్కు చెందిన ఎంవి హర్షవర్దన విశాఖ నుంచి మంగళవారం పోర్టుబ్లెయిర్కు బయలుదేరింది. దాదాపు ఆరు గంటల ప్రయాణం తరువాత నౌకలో ఇంజన్ జనరేటర్ పని చేయడం నిలిచిపోవడం తెలిసిందే. దీంతో నౌకా సిబ్బంది మరమ్మతు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో నౌకను తిరిగి విశాఖకు గురువారం తీసుకువచ్చారు.
మరమ్మతులు కాకపోవడం..
ఈ నౌకకు మరమ్మతు చేసే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాకపోవడంతో ప్రయాణికులకు టికెట్ చార్జీలను తిరిగి చెల్లించి పంపేందుకు నిర్ణయించారు. నౌకలో దాదాపు 506 మంది ప్రయాణికులు ఉన్నారు. నీరు, ఆహారం లేక ఇక్కట్లు పడ్డారు. టాయిలెట్లలో రెండు అడుగల మేర నీరు నిలవడంతో వాసన భరించ లేక డెక్పై పొడుకోవాల్సి వచ్చిందని ప్రయాణికులు తెలిపారు.
నరకం చూశాం
ఆహారం అధిక ధరలకు కొనుక్కోవాల్సి వచ్చిందని, ఉడికీఉడకని బిర్యానీ, నీళ్ల పాలను కొనుక్కున్నామని ఆరోపించారు. బయట వర్షం పడుతున్నప్పటికీ లోపల ఉక్క పోతతో ఇబ్బంది పడ్డారు. నౌకా సిబ్బంది పట్టించుకోలేదని, గురువారం సాయంత్రం ప్రయాణికులు అంతా కెప్టెన్ను చుట్టుముట్టి ప్రశ్నించాకే విశాఖకు తిరిగి తీసుకువెళ్లేందుకు నిర్ణయించారని తెలిపారు. నౌక విశాఖకు చేరుకున్నప్పటికీ గంటల కొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది.
ప్రయాణికుల ఆందోళన
నౌక మరమ్మతుకు సమయం పట్టేలా ఉందని భావించి ఎట్టకేలకు ప్రయాణికులను తిరిగి పంపేసేందుకు నిర్ణయించారు. ఈ దిశలో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. అమలాపురం, పలాస, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి సోమవారమే వచ్చామని, తెచ్చుకున్న డబ్బులన్నీ ఈ మూడు రోజుల్లో అయిపోయాయని, తమను ప్రత్యేక నౌకలో అండమాన్కు తీసుకువెళ్లాల్సిందేని గాంధీ డాక్ గేట్ వద్ద ఆందోళనకు దిగడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తిరిగి వెళ్లేందుకు తమ వద్ద డబ్బులు లేవని వాపోయారు.
ఆహారం కోసం అలమటించారు
మూడు రోజుల సమయం ఇక్కడే గడిచిపోయిందని, తిరిగి ఎప్పటికి అండమాన్ వెళ్లగలమోనని ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారు, పిల్లలు, మహిళలు ఆహారం లేక, తగిన సమచారం లేక నానా అగచాట్లు పడ్డారు. విజయనగరం జిల్లా ఎల్కోట మండలం భీమాళికి చెందిన మణికంఠ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో అధికారుల కాళ్లు పట్టుకుని అతని తల్లి వరలక్ష్మి బతిమిలాడింది. దీంతో అతన్ని ముందుగా బయటకు వచ్చేందుకు అనుమతించారు.
బంధువుల రాకతో..
లగేజీ, టిక్కెట్టు డబ్బు వాపసు వ్యవహారం తేలకపోవడంతో సాయంత్రం వరకూ అక్కడే ఉండాల్సి వచ్చింది. కొంతమంది తమ బంధువులు చనిపోవడంతో చూసేందుకు వచ్చిన వారు, అమ్మమ్మ దగ్గరికి వెళ్లేవారు, బంధువు పెళ్లికి వచ్చి తిరిగి వెళ్తున్న వారు, ఆరోగ్య పరీక్షలకు వచ్చి వెళ్తున్న వారు ఉన్నారు. తమ వారి క్షేమ గురించి తెలుసుకునేందుకు వచ్చిన వారితో పోర్టు ఏరియా నిండిపోయింది. సాయంత్రం నాలుగు గంటలు దాటాక చెల్లింపులు ప్రారంభించారు.
ఎందుకిలా జరిగింది
1974లో జలప్రవేశం చేసిన ఎంవీ హర్షవర్ధన్ నౌక 20 ఏళ్ల మాత్రమే సేవలు అందించాల్సి ఉంది. దీనిని అండమాన్-నికోబార్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుపుతున్నాయి. అయితే నౌక బాగోగులను అండమాన్ ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. దీంతో ఈ నౌక జీవితకాలం తగ్గుతూ వచ్చింది. దీనికితోడు నౌకకు ఫిట్నెస్ ధ్రువపత్రం జారీ చేయాల్సిన ఇండియన్ రిజిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ కూడా చూసీచూడనట్లు వ్యవహరించింది. మరోవైపు ఈ నౌక ప్రయాణానికి అనువుగా ఉందని మెర్కంటైల్ మెరైన్ విభాగం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఫిట్నెస్, ప్రయాణ అనుమతి తదితరాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ విభాగాలన్నీ సమర్థంగా తమ విధులను నిర్వర్తించక ప్రయాణికులకు ఈ పరిస్థితి దాపురించింది.