నేడే "మా" కార్యవర్గ ప్రమాణ స్వీకారం - ముఖ్య అతిధి ఫిక్స్ : మెగాస్టార్ కు ఆహ్వానం ఉందా..!!
హోరా హోరీగా సాగిన "మా" ఎన్నికలు ముగిసాయి. అధ్యక్షుడిగా గెలిచిన విష్ణు బాధ్యతలు స్వీకరించారు. ఆనవాయితీ ప్రకారం "మా" అధ్యక్షుడితో పాటుగా కార్యవర్గం ప్రమాణ స్వీకారానిని సిద్దం అవుతోంి. మరి కాసేపట్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. అయితే ఎన్నికల సమయంలో మొదలైన వివాదాలు ఇంకా ముగియ లేదు. ఎన్నికలు పూర్తయిన తరువాత పరిశ్రమ కోసం అందరం కలిసి పని చేస్తామని చెప్పినా..ఆ పరిస్థితులు కనిపించటం లేదు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి ఎన్నికైన కార్యవర్గ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసారు.
విష్ణు ప్రమాణ స్వీకారినికి హాజరయ్యేదెవరు
కొత్త అధ్యక్షుడు విష్ణు ఆ రాజీనామాల పైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక, ప్రకాశ్ రాజ్ పోలింగ్ రోజు జరిగిన సంఘటనల పైన న్యాయ పోరాటానికి సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ఇప్పటికే ఆ రోజు రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజ్ కావలంటూ ఎన్నికల అధికారికి లేఖ రాసారు. ఆయన సైతం నిబంధనలకు అనుగుణంగా ఇస్తామని చెప్పారు. ఈ సమయంలో "మా" కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఎవరెవరు హాజరు అవుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఉదయం 11 గంటలకు మా అధ్యక్షుడిగా మంచు విష్ణు మరియు కార్యవర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
మంత్రి తలసానికి ఆహ్వానం
ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్లో పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు జరుగుతుండగా.. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఇక, ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా 'మా' సభ్యులందరికీ ఇప్పటికే సందేశాలు పంపించారు. మరోవైపు.. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మా ప్రెసిడెంట్ మంచు విష్ణు, డీఆర్సీ సభ్యులు మోహన్ బాబు.. సినీ ఇండస్ట్రీలోని కొందరు పెద్దలను ఆహ్వానించినట్లుగా సమాచారం. నందమూరి బాలకృష్ణ.. సత్యనారాయణ .. కోట శ్రీనివాస రావు.. పరుచూరి బ్రదర్స్ వంటి వారిని స్వయంగా ఆహ్వానించారు.
మెగాస్టార్ హాజరవుతారా.. మోహన్ బాబు ఆహ్వానించారా
అదే సమయంలో తాను చిరంజీవిని సైతం కలుస్తానంటూ విష్ణు చెప్పుకొచ్చారు. అయితే, చిరంజీవిని..మెగా హీరోలను కలిసారా లేదా అనేది స్పష్టత లేదు. ఇక, వారికి సైతం ఇతరులతో పాటుగా ఆహ్వానం పంపారని మరో టాక్. విష్ణు సోదరుడు మనోజ్ రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ను కలిసారు. భీమ్లా నాయక్ షూటింగ్ స్పాట్కు వెళ్లిన మనోజ్ పవన్తో సుమారు గంటకుపైగా పలు విషయాలపై చర్చించారు.. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న పరిణామాలతోపాటు తాజా చిత్రాల ప్రస్తావన వచ్చిందని చెబుతున్నారు.
ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాల పైనా
మోహన్ బాబు - నరేశ్ తమ ప్యానల్ సభ్యుల పైన పోలింగ్ సమయంలో దాడికి దిగారని ప్రకాశ్ రాజ్ ఆరోపిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే నాగబాబు "మా" సభ్యత్వానికి రాజీనామా చేసారు. అయితే, మెగాస్టార్ మాత్రం ఎక్కడా వ్యతిరేకంగా స్పందించ లేదు. గెలిచిన సభ్యులకు అభినందనలు తెలిపారు. ఇక నుంచి "మా" ఎన్నికల్లో పోటీ ఉండదని..ఏకగ్రీవం మాత్రమే ఉంటుందని ఫలితాల తరువాత మోహన్ బాబు స్పష్టం చేసారు.
Recommended Video
అందరి ఫోకస్ మెగా క్యాంపు పైనే
అయితే, ఇప్పుడు "మా" కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి మెగాస్టార్ తో సహా మెగా క్యాంపు నుంచి ఎవరైనా హాజరవుతారా ...లేక కేవలం విష్ణు- మోహన్ బాబుకు మద్దతుగా నిలిచిన వారు మాత్రమే ఇందులో పాల్గొంటారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేసి గెలిచిన వారు మాత్రం హాజరయ్యే అవకాశం కనిపించటం లేదు. ప్రకాశ్ రాజ్ కు విష్ణు ఆహ్వానం పంపారని చెబుతున్నారు. ఆయన హాజరు సైతం అనుమానంగానే కనిపిస్తోంది. దీంతో..ఈ ప్రమాణ స్వీకారం ద్వారా "మా" భవిష్యత్ సమీకరణాల పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.