సరదా కోసం చేస్తే సోనూసూద్ ట్రాక్టరిచ్చాడు- సర్కార్ ఆగ్రహం- వెనక్కిచ్చేస్తానంటున్న రైతు...
ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలోని ఓ గ్రామంలో కుటుంబ సభ్యులతో దుక్కిదున్నిస్తూ వీడియో తీసుకున్న రైతుకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ ట్రాక్టర్ పంపిన వ్యవహారంలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. అధికారులు, మీడియా ఎంట్రీతో రైతు మాట మార్చేశాడు. సరదా కోసం తీసుకున్న వీడియో వైరల్ అవుతుందని తాను అనుకోలేదని చెబుతూ ప్రభుత్వానికి ట్రాక్టర్ వెనక్కి ఇస్తానంటున్నాడు. దీంతో ఈ మొత్తం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సొంత జిల్లాలో జరిగిన ఈ వ్యవహారం నిర్ధారించుకోకుండా సోనూసూద్ కు అభినందనలు తెలిపిన విపక్ష నేత చంద్రబాబు కూడా దీంతో ఇరుకున పడ్డారు.
Recommended Video
సోనూసూద్కు చంద్రబాబు: మేం భరిస్తామని హామీ: త్వరలో కలుద్దామన్న యాక్టర్: స్పందించిన రైతు
ట్రాక్టర్ వ్యవహారంలో భారీ ట్విస్ట్...
రాయలసీమలోని చిత్తూరు జిల్లా మదనపల్లె పరిధిలోకి వచ్చే మహల్ రాజువారి పల్లె గ్రామంలో ఓ రైతు వేరుశెనగ పంట వేసేందుకు వీలుగా పొలం దున్నేందుకు ఎడ్లు లేకపోవడంతో తన కుటుంబ సభ్యులతో దుక్కి దున్నిస్తున్న వీడియో తాజాగా వైరల్ అయింది. ఈ వీడియో కాస్తా కొందరు మీడియా ప్రతినిధులు ట్వీట్ చేయడంతో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కు చేరింది. కొంతకాలంగా సామాజిక సమస్యలపై స్పందిస్తున్న సోనూ సూద్ దీనిపై స్పందించాడు. రైతుకు 24 గంటల్లో దుక్కిదున్నుకునేందుకు ట్రాక్టర్ పంపాడు. అయితే చివరికి ఆ రైతు సరదాగా చేసిన పని వైరల్ కావడంతో సోనూసూద్ కూడా ఇదంతా తెలియకుండానే ట్రాక్టర్ పంపినట్లు తేలింది.
అసలేం జరిగిందంటే...
మదనపల్లెలో టీ కొట్టు నడుపుకుంటున్న నాగేశ్వరరావు కరోనా కారణంగా తన స్వగ్రామం మహల్ రాజువారి పల్లెకు తిరిగొచ్చేశాడు. తన తల్లితండ్రులకు ఉన్న కొద్దిపాటి పొలంలో వేరుశెనగ పంట వేసుకుని వ్యవసాయం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం రాయలసీమలో ఎన్నడూ లేనంతగా వర్షాలు కురుస్తున్నాయి. సాధారణం కంటే అత్యధికంగా వర్షపాతం నమోదవుతోంది. దీంతో రైతులు పొలం పనులకు పరుగులు పెడుతున్నారు. ఇదే కోవలో ట్రాక్టర్ లేదా ఎడ్లను తీసుకొచ్చి వెంటనే వ్యవసాయం చేసే పరిస్దితి లేదు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి వెంటనే పొలం దున్నాలని నాగేశ్వరరావు భావించాడు. అనుకున్న వెంటనే కుటుంబ సభ్యులతోకలిసి భుజాలతో నాగలి లాగాడు. దీన్ని వీడియో కూడా తీసుకున్నాడు. ఎప్పుడో ఓసారి చేస్తున్న పని కాబట్టి ఈ వీడియోను స్నేహితులకు, బంధువులకు పంపాడు. ఇది మరో రకంగా వైరల్ అయింది. ట్రాక్టర్ కానీ, ఎడ్లు కానీ లేకపోవడంతో రైతు నాగేశ్వరరావు కుటుంబంతో దుక్కి దున్నిస్తున్నట్లు వైరల్ కావడంతో చివరికి సోనూ సూద్ కూడా స్పందించి ట్రాక్టర్ పంపాడు.
సోనూ ట్వీట్ల తర్వాత సర్కార్ సీరియస్...
మదనపల్లెలో రైతు కుటుంబం దుక్కి దున్నేందుకు ట్రాక్ట్రర్ కానీ ఎడ్లు కానీ లేకపోవడంపై స్పందించి ట్రాక్టర్ పంపిన సోనూ సూద్... వీరికి మద్దతుగా రెండు ట్వీట్లు పెట్టాడు. వీటిపై ఏపీ సీఎంవో వెంటనే స్పందించింది. స్దానిక ఎంపీడీవోకు సమాచారం పంపింది. దీంతో ఆయన స్ధానికంగా వివరాలు తెలుసుకున్నారు. ఇందులో నాగేశ్వరరావు కుటుంబం నెల రోజుల క్రితమే మహల్ రాజు వారి పల్లె గ్రామానికి వచ్చిందని, సరదా కోసం కుటుంబమంతా కలిసి దుక్కిదున్నిందని తెలిసింది. దీంతో ప్రభుత్వం సీరియస్ అయింది. రైతు రాజ్యంగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న తరుణంలో సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయలసీమ ప్రాంతంలో ఓ రైతు కుటుంబానికి దుక్కి దున్నేందుకు ట్రాక్టర్, ఎడ్లు లేకపోవడం దారుణమంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించి ట్రాక్టర్ వెనక్కి ఇప్పించేందుకు సిద్ధమవుతున్నారు.
సరదా కోసం చేశానంటూ...
ప్రభుత్వ ఆగ్రహం తర్వాత మీడియా మందుకు వచ్చిన రైతు నాగేశ్వరరావు... తాను కుటుంబంతో కలిసి సరదా కోసమే ఈ విధంగా దుక్కి దున్ని వీడియో తీసుకున్నట్లు చెప్పాడు. ఇదిలా వైరల్ అవుతుందని తాను అనుకోలేదన్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ అధికారులకు కూడా తాను చెప్పినట్లు రైతు పేర్కొన్నాడు. ఈ వీడియో వైరల్ తర్వాత మదనపల్లె కు చెందిన చాలా మంది ఈ వ్యవహారంపై ఆరా తీశారు. దీంతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న నాగేశ్వరరావు.. ఆ ట్రాక్టర్ ను సోనూ సూద్ కు తిరిగి ఇవ్వడమో లేక పంచాయతీకి ఇచ్చేయడమో చేస్తానని చెబుతున్నాడు.
విషయం తెలియక ఇరుక్కున్న చంద్రబాబు..
కష్టంలో ఉన్న రైతుకు సోనూసూద్ ట్రాక్టర్ పంపాడన్న విషయం పార్టీ నేతల నుంచి తెలుసుకున్న విపక్ష నేత చంద్రబాబు అభినందనలు తెలుపుతూ ఫోన్ చేయడమే కాకుండా రైతు కుమార్తెల చదువులను టీడీపీ చూసుకుటుందంటూ హామీ కూడా ఇచ్చేశారు. చివరికి ఈ వ్యవహారం ఫేక్ అని తెలియడంతో ఇప్పుడు చంద్రబాబు ఇరుకునపడ్డారు. సోనూసూద్ సాయం చేశాడని తెలియగానే విషయం నిర్ధారించుకోకుండానే సాయానికి సిద్ధమైన చంద్రబాబు.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు మంచి అవకాశం దొరికిందని మాత్రమే భావించారు. తాజాగా విషయం తెలియడంతో దీనిపై ఎలా స్పందించాలో తెలియక ఊరుకున్నారు.