మదరసాల్లో మైనర్ బాలికలపై ఆకృత్యాలు.. తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూస్తున్న వరుస ఘటనలు
గుంటూరు: చదువు చెప్పాల్సిన గురువు గలీజు పనులకు పాల్పడ్డ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. మదరసాలో చదువుకునేందుకు వచ్చిన బాలికపై కీచక గురువు కన్నేసి ఆ చిన్నారిని లొంగదీసుకున్నాడు. అనంతరం ఆ బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. గుంటూరు జిల్లా దాచేపల్లిలోని చాపలగడ్డ మదరసాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
చదువు కోసం వచ్చిన బాలికను లొంగదీసుకున్న గురువు
అలీం కోర్సు చదివేందుకు 17 ఏళ్ల వయసున్న బాలిక మదరసాకు వచ్చింది. ఈ మదరసాను షేక్ ముఫ్తీ అబ్దుల్ సత్తార్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. అతనికి పెళ్లయి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. తండ్రి వయసున్న ఈ కీచక గురువు 17 ఏళ్ల బాలికపై కన్నేసి ఆమెను లొంగదీసుకున్నాడు. ఇది గత కొద్దిరోజులుగా జరుగుతోంది. అమ్మాయిపై లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడు. గురువారం రాత్రి బాలిక సత్తార్ ఇద్దరు కలిసి ఉండటాన్ని గమనించిన తోటి విద్యార్థులు ఏం జరుగుతోందని నిలదీశారు. దీంతో అసలు విషయం బయటపడింది.
వారం క్రితమే బాలికను పెళ్లి చేసుకున్నాడట..!
సత్తార్ వ్యవహారం బయటపడటంతో విద్యార్థులు ముస్లిం మతపెద్దల దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారం కిత్రమే తాను బాలికను పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. ఈ కీచక గురువు చేసిన పనికి బాలికల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మైనార్టీ తీరని బాలికను పెళ్లి చేసుకుని ఆమె భవిష్యత్తుతో ఆడుకున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మదరసా ఇంటిముందే వారు ధర్నాకు దిగారు.
ముందుగా బాలికను ఆ తర్వాత ఆమె చెల్లెను...
ఇదిలా ఉంటే తెలంగాణలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మదర్సా నిర్వహిస్తున్న వలీ అహ్మద్ కుమారుడు అబ్దుల్ రజాక్ ఓ అమ్మాయిని లొంగదీసుకుని శారీరకంగా వాడుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆమెను వివాహం చేసుకున్నాడు. అప్పటికే అబ్దుల్ రజాక్కు పెళ్లైంది. ఇక బాలిక చెల్లెలు కూడా మదరసాలో చేరింది. ఆమెపై కూడా కన్నేసి లొంగదీసుకున్నాడు. ఆమె గర్భం దాల్చడంతో ఆ చిన్నారిని కూడా పెళ్లి చేసుకున్నాడు ఈ ప్రబుద్ధుడు అబ్దుల్ రజాక్. ఇలా మొత్తం మూడు వివాహాలు చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసునమోదు చేశారు పోలీసులు.
మొత్తానికి మతపరమైన అంశాలను నేర్చుకుందామనుకుని సుదూర ప్రాంతాల నుంచి మదరసాలకు వస్తున్న బాలికలను ఈ కీచక గురువులు లొంగదీసుకోవడం ఆందోళనకు గురిచేస్తుంది. తల్లిదండ్రులు అన్ని విచారించుకున్న తర్వాతే తమ పిల్లలను మదరసాలో చేర్చాలని పోలీసులు చెబుతున్నారు. అమ్మాయిలను బయటకు పంపేటప్పుడు జాగ్రత్తలు చెప్పి పంపించాలని సూచిస్తున్నారు.