సూరి హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పు: భానుకిరణ్కు యావజ్జీవం..ఆ నలుగురి విషయంలో ఏమైంది..?
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మద్దెలచెరువు సూరి హత్య కేసులో నాంపల్లి స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించింది. సూరి హత్యకేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న భానుకిరణ్ పై ఆరోపణలు రుజువుకావడంతో ఆయనకు యావజ్జీవ శిక్షతో పాటు రూ. 20వేలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న మన్మోహన్సింగ్కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 5వేలు జరిమానా విధించింది. మరో నలుగురని నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
3 జనవరి 2011లో సనత్నగర్లో ఓ కేసుకు సంబంధిచిన విషయం లాయరుతో చర్చించి కారులో భానుకిరణ్తో పాటు బయలుదేరాడు సూరీ. భానుకిరణ్ వెనక సీట్లో ఉండగా... ముందు సీటులో సూరీ కూర్చున్నాడు. కారును డ్రైవింగ్ సీటులో మధు ఉన్నాడు. కారు యూసఫ్ గూడా నవోదయ కాలనీకి చేరుకోగానే భాను పాయింట్ బ్లాంక్ దూరంలో సూరిని కాల్చి చంపి అనంతరం పారిపోయాడు. సూరిని అదేకారులో హాస్పిటల్కు తీసుకొచ్చాడు డ్రైవర్ మధు. అయితే మార్గమధ్యంలోనే సూరి చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ తర్వాత డ్రైవర్ మధుమోహన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 2016 ఆగష్టు 29న సూరి భార్య గంగుల భానుమతి వాంగ్మూలంతో విచారణ ప్రారంభమైంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 117 మంది సాక్షులను విచారణ చేశారు పోలీసులు.
పారిపోయిన భాను కిరణ్ 14 నెలలకు అంటే 2012 ఏప్రిల్ 12న పోలీసులకు చిక్కాడు. భాను కిరణ్ ఏ రివాల్వర్తో అయితే సూరిని చంపాడో ఆ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక భానుకిరణ్కు ఆయుధం సహాయం అందించిన బాడీగార్డ్ మన్మోహన్ సింగ్కు కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించడంతో పాటు రూ. 5వేలు జరిమానా విధించింది. ఇక కేసుకు సంబంధించి మరో నలుగురు సుబ్బయ్య , వెంకట రమణ, హరిబాబు, వంశీలపై సీఐడీ నేరాన్ని రుజువు చేయకపోవడంతో వారిని నిర్దోషులుగా కోర్టు తేల్చింది. భానుకిరణ్ పై 3 చార్జిషీట్లు దాఖలు చేశారు సీఐడీ పోలీసులు. సీఐడీ పోలీసుల పొందుపర్చిన సాక్షాలతో జడ్జీ సంతృప్తి చెందడంతో భానుకిరణ్కు యావజ్జీవ శిక్ష విధించారు. ఇదిలా ఉంటే ఆరేళ్లు అయినప్పటికీ జైలులోనే ఉండేందుకు భాను కిరణ్ ఇష్టపడ్డారు కానీ బెయిల్ కోసం ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు.