ఇది మేడిన్ ఆంధ్రా...తొలి డ్రోన్...కలెక్టర్ల సదస్సులో ఆవిష్కరించిన సిఎం చంద్రబాబు
అమరావతి: మొదట భద్రతా విభాగం అవసరాల కోసం తయారుచేయబడిన అనంతర కాలంలో అనేక రంగాల్లో అనూహ్యమైన సేవలు అందిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఖరీదు దృష్ట్యా ఇంకా అందరికీ అందుబాటులోకి రాని ఈ విచిత్ర పరికరాన్ని మన రాష్ట్రంలోనే తయారు చేసి ఔరా అనిపించింది ఎపి ఇన్నోవేషన్ సొసైటీ. అనేక ప్రత్యేకతలతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ "మేడిన్ ఆంధ్రా డ్రోన్" ను మీరు చూసేయండి మరి...
లక్ష్యానికి గురిపెట్టి శత్రువులను ఛేదించడానికి సైన్యం కోసం తయారుచేసిన ఓ పరికరం....ఊహించని రీతిలో ఇప్పుడు మంనందరి నిత్యజీవితాల్లోకి వచ్చేస్తోంది. అసాంఘిక శక్తులపై నిఘా పెడుతోంది...వేడుకల్లో ఫొటోలు తీస్తూ సందడి చేస్తోంది. వ్యవసాయంలో 'సాయానికీ' సై అంటోంది. వ్యాపారానికీ రెడీ అంటోంది. ఇప్పుడు సరకు రవాణాకు సైతం సహాయపడుతున్న ఈ డ్రోన్ రానున్న రోజుల్లో ప్రజారవాణాకీ సంసిద్దమవుతుందని నాసా కూడా సర్టిఫికెట్ ఇచ్చేసింది...మరి అంతటి ఘనమైన డ్రోన్...ఇప్పుడు మనకు అత్యంత అందుబాటులోకి వచ్చేసింది..ఎలాగంటే...
ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ డ్రోన్ల తయారీ మొదలైంది. అలా తయారుచేయబడిన మొట్ట మొదటి డ్రోన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సదస్సులో ఆవిష్కరించారు. ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ, డ్రోన్ తయారీ సంస్థ ఓమ్ని ప్రెసెంట్ సంయుక్త భాగస్వామ్యంతో ఇటీవలే విశాఖపట్నంలో డ్రోన్ల కంపెనీ ఏర్పాటయింది. అమరావతి డ్రోన్ల కంపెనీగా నామకరణం చేసిన ఈ కంపెనీ తయారు చేసిన తొలి డ్రోన్ ఇదే కావడం విశేషం. ఈ మేడిన్ ఆంధ్రప్రదేశ్ డ్రోన్ ప్రత్యేకతలను ఐటీ శాఖ మంత్రి లోకేష్ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించారు.
మార్కెట్లో లభ్యమయ్యే అన్ని డ్రోన్ల మాదిరి కాకుండా ఈ డ్రోన్ కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయని ఐటి మంత్రి లోకేష్ సిఎంకు తెలిపారు. మార్కెట్ లో లభించే డ్రోన్ల కన్నా వీటి నాణ్యత ఎక్కువని, పైగా బాగా తక్కువ ధరలకే ఈ ఆంధ్రా డ్రోన్లను తయారు చేస్తున్నట్లు లోకేష్ వివరించారు. సాంకేతికంగా ఉన్నత శ్రేణి పరికరంగానే కాకుండా అందుబాటు ధరలో రూపొందించిన డ్రోన్ ఇదని సీఎంకు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్ తెలిపారు.