మధు యాష్కీ ఎదురీత: దూసుకెళ్తున్న కవిత, యెండల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చామని కాంగ్రెసు, మద్దతిచ్చామని బిజెపి, తెచ్చామని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. మూడు పార్టీలో తెలంగాణ అంశంతోనే జోరుగా ప్రచారం చేస్తున్నాయ. ఈ నేపథ్యంలో సిట్టింగ్ కాంగ్రెసు అభ్యర్థులు బిజెపి, తెరాస అభ్యర్థుల నుండి పోటీ ఎదుర్కొంటున్నారు.
నిజామాబాద్, జహీరాబాద్ నియోజకవర్గాలలో కాంగ్రెసు పార్టీ ఎంపీలు ఉన్నారు. మధుయాష్కీ నిజామాబాద్, సురేష్ షేట్కార్ జహీరాబాద్ ఎంపీగా ఉన్నారు. ఈ ప్రాంతాల్లో తెరాస దూసుకెళ్తోంది. పోలింగ్కు సమయం సమీపించినప్పటికీ సిట్టింగ్ ఎంపిలుగా కొనసాగుతున్న మధుయాష్కీ, సురేష్ శెట్కార్లు మాత్రం ప్రచార పర్వాన్ని పదునెక్కించలేదంటున్నారు. ప్రత్యర్థుల నుండి గట్టి పోటీ ఎదురవుతున్న తరుణంలోనూ సిట్టింగ్లు దూసుకెళ్లడంలో విఫలమవుతున్నారంటున్నారు.
ముచ్చటగా మూడవసారి విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేయాలని మధుయాష్కీ అందుకు తగ్గట్టుగా వెళ్లడం లేదంటున్నారు. 2004, 2009 ఎన్నికల్లో రెండు పర్యాయాలూ ఆయనను పూర్తిగా తెలంగాణ సెంటిమెంటే గట్టెక్కించింది. ఎంపిగా ఎన్నికైన నాటి నుండి తెలంగానం వినిపించారు. తన తెలంగాణవాదమే గట్టెక్కిస్తుందని ఆయన ధీమాతో ఉన్నారు. అయితే, కెసిఆర్ కూతురు కవిత నుండి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారంటున్నారు. ఇంకోవైపు బిజెపి నేత యెండల లక్ష్మీ నారాయణ నుండి కూడా గట్టి పోటీ నెలకొంది.
నిజామాబాద్ అర్బన్ నుండి 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన యెండల... ఏడాది కాలం సైతం గడవకముందే తెలంగాణ కోసం తన పదవిని త్యజించి తెలంగాణవాదుల దృష్టిలో హీరోగా నిలిచారు. తెలంగాణ పట్ల ఆయన చాటుకున్న చిత్తశుద్ధికి తోడు మోడీ ప్రభంజనం కలిసి వస్తుండడంతో ఎంతో ఉత్సాహంగా ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. నాటి ఉప ఎన్నికల్లో డిఎస్ పైన గెలిచి తన సత్తా చాటాడు. తెరాస, బిజెపి దూకుడు చూస్తుంటే యాష్కీ గట్టి పోటీనే ఎదుర్కొంటున్నట్లుగా కనిపిస్తోంది.
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాన్ని పరిశీలించినా, తెరాస అభ్యర్థిదే స్పష్టమైన ఆధిపత్యం కనిపిస్తోంది. తెరాస తరఫున పోటీ చేస్తున్న బిబి పాటిల్ అన్ని వర్గాల వారితో సమన్వయం పెంపొందించుకుని మద్దతును కూడగట్టుకునే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నారు. బిజెపి మద్దతుతో పోటీ చేస్తున్న టిడిపి అభ్యర్థి మదన్ మోహన్ రావు కూడా దూసుకెళ్తున్నారు.