కోట్లు వెదజల్లాడు, ఓదార్చాల్సి వస్తుంది: జగన్పై యాష్కీ
నల్లగొండ: తెలంగాణా బిల్లును అడ్డుకునేందుకు పార్టీలకతీతంగా సీమాంధ్ర పార్లమెంటు సభ్యులనుకూడదీసి వైయస్సార్ కాంగ్రెసు నేత వైయస్ జగన్ కోట్ల రూపాయలు వెదజల్లాడని తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ ధ్వజమెత్తారు. ఓదార్పు యాత్ర పేరిట జగన్ నల్లగొండలో పర్యటించాలని చూస్తున్నారని, నల్లగొండలో అడుగు పెడితే ఆయననే ఓదార్చాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
'సోనియమ్మకు తెలంగాణ సలాం' పేరిట శుక్రవారం సాయంత్రం నల్లగొండ జిల్లా భువనగిరిలో కృతజ్ఞత సభ జరిగింది. భారీఎత్తున ని ర్వహిచిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీకి చెందిన ఎంపీలు పాల్గొన్నారు.
ఉజ్జయిని మహంకాళి అంత శక్తివంతమైందిగా సోనియాగాంధీని సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్కుమార్యాదవ్ అభివర్ణించారు. పడుకున్న శవాన్ని సైతం లేపే శక్తి కళాకారులకుందనే విషయం తెలంగాణ ఉద్యమంలో రుజువైందన్నారు. ఓట్లు, సీట్ల కోసం కాకుండా ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడిన సోనియాను నిందించేవాళ్లు మనుషుల రూపంలో ఉన్న మృగాలని భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మండిపడ్డారు. అమరుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఊపిరి ఉన్నంత వరకు కోమటిరెడ్డి బ్రదర్స్ కాం గ్రెస్లోనే ఉంటారని, పదవుల కోసం తమ కుటుంబం రాజీ పడదని, కంఠంలో ప్రాణమున్నంతవరకు భువనగిరి ప్రజలను కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. బిడ్డలకు, భార్యలకు వారసత్వంగా పదవులు కట్టబెట్టే విషయలో కాంగ్రెస్ పెద్దలు పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.