హెలికాప్టర్పై కెసిఆర్కు యాష్కీ, నాతో సహా... : పొన్నం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఓటు వేయడానికి కూడా హెలికాప్టర్ పైన వెళ్లారని, ఇందుకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయో చెప్పాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ శనివారం ప్రశ్నించారు. ఆయన కరీంనగర్ జిల్లాలో విలేకరులతో మాట్లాడారు.
నిజామాబాద్ ఎంపీ పదవికి పోటీ చేసిన కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత దాదాపు 35 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. ఉద్యమ పార్టీకి ఇంత మొత్తం ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి 90 సీట్లు వస్తాయంటూ కెసిఆర్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. చందాలు కాపాడుకునేందుకే ప్రభుత్వం తమదే అంటున్నారన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్కు మద్దతునిస్తామని కెసిఆర్ చేసిన ప్రకటనను పొన్నం ప్రభాకర్ స్వాగతించారు. పార్టీకి మద్దతు ఇస్తామంటే ఎవరూ వద్దనరన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలం సోనియాగాంధీ చొరవ వల్లే సాధ్యమైందని ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో పార్టీ నాయకులందరూ విఫలమయ్యారని అంగీకరించారు. ఇందులో తనకూ మినహాయింపు లేదన్నారు.
ఎన్నికల కోసమో, అధికారం కోసమో సోనియా తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదని, ప్రజల ఆకాంక్ష మేరకే ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనక్కి తగ్గకుండా రాష్ట్రం ఏర్పాటు చేశారన్నారు. ఈ విషయాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్ళి ఓట్లుగా మలుచుకోవడంలో పార్టీ నాయకత్వం సఫలం కాలేకపోయిందన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.