వారికి క్షమాభిక్ష..వీరికి ఉరిశిక్ష: యాష్కీ, టిజి Vs కోట్ల
ఫిబ్రవరి 15-21వ తేదీ మధ్య తెలంగాణ ముసాయిదా బిల్లును కేంద్రం పార్లమెంటులో పెట్టే అవకాశం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తా లేక విలీనమా అనే విషయమై తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆలోచించడం లేదని యాష్కీ చెప్పారు. పొత్తుల గురించి ఆలోచించకుండానే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ ప్రాంత ఉద్యోగుల, ప్రజా సంఘాల ఒత్తిడి కొత్త ప్రభుత్వంపై ఉండాల్సిందేనని యాష్కీ అభిప్రాయ పడ్డారు. వారి ఒత్తిడి లేకుంటే ఆంధ్రా పాలకుల కంటే అన్యాయంగా పాలిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.
టిజి వర్సెస్ కోట్ల
కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ల మధ్య మాటల యుద్ధం సాగింది. టిక్కెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ కార్యాలయానికి నిప్పు పెట్టిన ఘనత కోట్ల కుటుంబానిదేనని టిజి ఆదివారం అన్నారు. కాంగ్రెస్ నేతలను ఎవరినీ తాను విమర్శించలేదని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవనే భయంతో ఎవరుపడితే వారిపై వ్యాఖ్యలు చేస్తున్నారని టిజి ఆరోపించారు. కోట్ల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు.
విభజన జరిగితే కాంగ్రెస్ పార్టీని వీడతానన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని టిజి తెలిపారు. పార్టీ కన్నా ప్రజల మనోభావాలే ముఖ్యమన్నారు. విభజనంటూ జరిగితే సీమాంధ్రలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే కాంగ్రెస్ ఖాళీ కావడం ఖాయమన్నారు. కాగా, ఓ వైపు మంత్రి పదవులు అనుభవిస్తూ మరోవైపు కాంగ్రెస్ పార్టీని నిందించటం సరికాదని టిజిని ఉద్దేశించి కోట్ల శనివారం అన్నారు. టిడిపిలో సీటు ఖరారు చేసుకొని టిజి విమర్శలు చేస్తున్నారని, ఏ గూటి నుండి వచ్చారో ఆ గూటికి వెళ్లడం ఖాయమని విమర్శించారు. కోట్ల వ్యాఖ్యలను టిజి తిప్పి కొట్టారు.