ఆయన ఏ చీకట్లో ఉన్నాడో?: కిరణ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ స్పీకర్
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ స్పీకర్ మధుసూదనా చారి తనదైన శైలిలో స్పందించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కరెంటు లేక అంధకారంగా మారుతుందన్న ఆ పెద్ద మనిషి ఇప్పుడు ఏ చీకట్లో ఉన్నాడో? కనబడటం లేదు? అని ఎద్దేవా చేశారు.
స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా బుధవారం ఆయన నగరంలోని నల్లకుంటలో పర్యటించారు. న్యూనల్లకుంట నరేంద్ర పార్క్లో పార్క్ సొసైటీ సభ్యులతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి అప్పట్లో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.
పార్క్ సమస్యలను తెలుసుకున్న ఆయన, వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మొన్నటి వరకు అయోమయ స్థితిలో ఉన్న తెలంగాణ ఇప్పుడు అన్ని రంగాల్లోనూ పురోగామి దిశగా సాగుతోందని చెప్పారు.
పారిశ్రామిక రంగానికి హైదరాబాద్ అనువైన కేంద్రమని ప్రపంచం మొత్తం ఆలోచించే స్థితికి కెసిఆర్ సారథ్యంలోని టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని మధుసూదనా చారి అన్నారు.
చెరుకు రైతులు అధైర్యపడొద్దు: జూపల్లి
రాష్ట్రంలోని చెరుకు రైతులు అధైర్యపడొద్దని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. చక్కెర పరిశ్రమల ప్రతినిధులతో మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఈటెల రాజేందర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ఇతర రాష్ర్టాల నుంచి రాష్ర్టానికి చక్కెర దిగుమతి అవుతోందన్నారు.
రాష్ట్ర అవసరాలకు ఇక్కడ ఉత్పత్తయ్యే చక్కెరనే వినియోగించే యోచనలో ఉన్నామని చెప్పారు. రైతులకు లబ్ధి చేకూరాలంటే కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. రైతులకు తక్షణమే బకాయిలు చెల్లించేలా చూస్తామని పేర్కొన్నారు.