నాపై లగడపాటి దాడి: యాష్కీ, లోకసభ ఘటనపై బొత్స
ఇద్దరు సీమాంధ్ర వ్యాపారవేత్తలు తమ అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు తెలంగాణను అడ్డుకుంటున్నారని లగడపాటి రాజగోపాల్, మరో ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలను ఉద్దేశించి అన్నారు. పార్లమెంటులో ఉదయం 11 గంటలకు ఏం జరుగుతుందో చూడాలని లగడపాటి రాజగోపాల్ మీడియా సమావేశంలో పేర్కొన్నాడని, పార్లమెంటులో జరిగిన పరిణామాలన్నీ ముందు నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారమే చేశారని ఆరోపించారు.
లగడపాటి రాజగోపాల్ స్ప్రే చల్లడంతో పార్లమెంటులోని సుష్మా స్వరాజ్ తోపాటు పొన్నం ప్రభాకర్, వినయ్ దేశ్ పాండే, పలువురు సభ్యులు అస్వస్థతకు గురయ్యారని మధుయాష్కీ తెలిపారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కత్తి లాంటి ఆయుధంతో అద్దాలను పగులగొట్టారని అన్నారు. బహిష్కృత ఎంపి సబ్బంహరి పార్లమెంటులో ఏదో చేస్తామని చెప్పారని, ఆయనే కాక లగడపాటి, మోదుగల గురువారం రోజు వ్యవహరించిన తీరు సిగ్గుపడే విధంగా ఉందని అన్నారు.
తమ నేర చరిత్రను కప్పిపుచ్చుకునేందుకు లగడపాటి, మోదుగల సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని మధుయాష్కీ ఆరోపించారు. ఈ సమయంలో తెలంగాణ ప్రజలు సమన్వయం పాటించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణను అడ్డుకునేందుకు జాతీయ నేతలందర్నీ కలుస్తున్నారని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా నేతలు కాళ్లు పట్టుకుంటున్నారని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ అసలు రంగు బయటపడుతోందని, బిల్లుకు మద్దతు తెలుపుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.
నా జీవితంలో చూడలేదు: వీహెచ్
గురువారం రోజు పార్లమెంటులో జరిగిన పరిణామాలను తన జీవితంలో చూడలేదని పార్లమెంటు సభ్యుడు వి హనుమంతరావు అన్నారు. ఆయన గురువారం మాట్లాడుతూ.. ఇలాంటి సమావేశాలను ఇంకెప్పుడు చూడొద్దని కోరుకుంటున్నట్లు చెప్పారు. సీమాంధ్ర ఎంపీల తీరుతో తాను తలవంచుకుంటున్నానని ఆయన అన్నారు.
సీమాంధ్రకు చెందిన ఓ ఎంపీ కత్తితో తీసుకొని దాడి చేసేందుకు ప్రయత్నిస్తే, మరో ఎంపీ స్ప్రే చల్లారని అన్నారు. హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, స్పీకర్ మీరా కుమార్పై స్ప్రే పడకుండా అద్దం అడ్డుపెడితే ఆ అద్దాన్ని కూడా ఓ ఎంపి పగులగొట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
లోకసభ ఘటనపై బొత్స
గురువారం లోకసభ ఘటనపై పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు చాలా బాధాకరమన్నారు. లోకసభలో జరిగిన ఘటనలు పునరావృతం కావొద్దన్నారు.