జగన్, యోగి బాటలో మరో సీఎం ... వలస కార్మికుల కోసం ఆ రాష్ట్రం సైతం
బతుకు దెరువు కోసం వలస వెళ్ళిన కార్మికులు కరోనా కష్ట కాలంలో బతుకు జీవుడా అంటూ కాలిబాటన కుటుంబాల చెంతకు చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారు . దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో బస్సులు, రైళ్ళు లేకపోయినా నడిచి వెళ్ళటానికి వారు సిద్ధం అయ్యారు. అయినాసరే వారిని అడ్డుకుంటున్న పోలీసులు క్వారంటైన్ కు పంపుతున్నారు . ఇక వారి అక్కడ ఉండలేక, తమ వారి కోసం , తమ కుటుంబాల దగ్గరకు వెళ్ళే రోజు కోసం దిగాలు చెందుతున్నారు.
విడిచిపెడితే నడిచి నేను పోతా సారూ' .. మనసును మెలిపెడుతున్న వలస జీవుల వెతలపై పాట
ఇక ఈ క్రమంలోనే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాలలో చిక్కుకున్న తమ వారిని ఇళ్ళకు చేర్చే ఆలోచన చేస్తున్నారు . ఏపీ సీఎం జగన్ , యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ తమ వారిని తిరిగి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్న క్రమంలో తాజాగా వీరి బాటలోనే చేరారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ . లాక్డౌన్ కారణంగా చిక్కుకున్న తమ ప్రాంత వలస కూలీలను స్వస్థలాలకు చేరుస్తామంటూ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఇప్పటికే గుజరాత్ లో చిక్కుకున్న మత్స్య కారులను వెనక్కు తీసుకురావటం కోసం ఏపీ సీఎం జగన్ , ఇక తమ వారిని స్వస్థలాలకు చేర్చటం కోసం యూపీ సీఎం ఆదిత్య నాథ్ ప్రయత్నాలు మొదలు పెట్టారు.
Recommended Video
ఇక తాజాగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్,మహారాష్ట్ర ముఖ్యమంత్రులతో చర్చలు జరిపారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు సహకారమందించేందుకు హామీ ఇచ్చారు. దేశంలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నందున ఇతర రాష్ట్రాలలోని తమ వారిని తీసుకువచ్చే క్రమంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటారు . ఇతర రాష్ట్రాల నుండి నుంచి వచ్చేవారిని సరిహద్దుల వద్ద పరీక్షలు నిర్వహిస్తారు. 14 రోజుల పాటు క్వారంటైన్ సెంటర్లలోనే ఉంచి పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటేనే ఇళ్లకు పంపిస్తారు. ఏది ఏమైనా వలస జీవుల మనో వేదన అర్ధం చేసుకున్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారిని తీసుకురావాలనే ఆలోచన చెయ్యటం శుభ పరిణామం .