రాజధాని అమరావతిపై మద్రాస్ ఐఐటీ నివేదిక వివాదం.. సమాధానం చెప్పని మంత్రి ..అసలేం జరిగిందంటే
రాజధాని అమరావతిపై మద్రాస్ ఐఐటీ నివేదిక వివాదం ఇప్పుడు ప్రకంపనలు రేపుతుంది .రాజధాని అమరావతిలో నిర్మాణాలు సురక్షితం కాదంటూ మద్రాస్ ఐఐటీ నివేదిక ఇచ్చిందని వైసీపీ నాయకులు జోరుగా ప్రచారం చేశారు. అయితే ఆ ప్రచారం అబద్ధమని తేలిపోయింది. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై తాము అలాంటి నివేదిక ఏదీ ఇవ్వలేదంటూ మద్రాస్ ఐఐటీ స్పష్టంచేసింది. ఈమేరకు అమరావతి రైతులకు మద్రాస్ ఐఐటీ అధికారులు ఇ-మెయిల్ పంపారు. అమరావతిలో నిర్మాణాలు సురక్షితం కాదని తాము చెప్పలేదని మద్రాస్ ఐఐటీ స్పష్టం చేసింది. అక్కడి నేల గట్టిగా లేదని నివేదిక ఇచ్చామనడం అబద్ధమని పంపిన మెయిల్ లో పేర్కొంది .
మద్రాస్ ఐఐటీ తాము రాజధానిపై నివేదిక ఇవ్వలేదని మెయిల్
రాజధానిగా అమరావతి సురక్షితం కాదని వైసీపీ నేతలు చేసిన వ్యాఖల నేపధ్యంలో మద్రాస్ ఐఐటీ పేరు బయటకు వచ్చింది . ఇక ఈ విషయంపై నివేదిక ఇచ్చారా అంటూ ఐఐటీ మద్రాస్కు రాజధాని ప్రాంత రైతులు మెయిల్ పంపగా వారు రిప్లై ఇచ్చారు . తాము రిపోర్ట్ ఇచ్చామనడాన్ని ఐఐటీ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఇప్పుడీ ఇ-మెయిల్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అమరావతిపై నెగెటివ్ ప్రచారం చేయాలనుకున్న ప్రభుత్వ వ్యూహం మరోసారి బెడిసి కొట్టిందని అమరావతి జేఏసీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మండిపడుతున్న రైతులు, టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్
అమరావతిలో నిర్మాణాలకు ఎక్కువ ఖర్చు అవుతుందని, భారీ నిర్మాణాలు కష్టమంటూ ఐఐటీ-మద్రాస్ పేరుతో మంత్రులు చేసిన ప్రకటనలు అవాస్తవం అని తేలిపోయిందని రైతులు అంటున్నారు.ఇక ఈ వ్యవహారంపై లోకేష్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి నివేదిక ఏదీ తాము ఇవ్వలేదని ఐఐటీ మద్రాస్ తేల్చి చెప్పిందని ఆయన పేర్కొన్నారు. దీంతో అమరావతిపై వైసీపీ చేస్తున్నదంతా విష ప్రచారమేనని తేటతెల్లమైందన్నారు.
ఒక అమరావతి, వైసీపీ 10 అబద్ధాలు అంటూ ట్విట్టర్ లో లోకేష్ పోస్ట్
‘ఒక అమరావతి, వైసీపీ 10 అబద్ధాలు' అంటూ ట్వీట్ చేసిన లోకేశ్ వైసీపీ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజా రాజధాని అయిన అమరావతి గురించి నిజాలు చెప్పేలోపు.. వైసీపీ చెప్పే అబద్ధాలు ప్రపంచాన్ని చుట్టి వచ్చేస్తున్నాయని అన్నారు. అమరావతిని చంపేందుకు వైసీపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు అన్నీ ఇన్నీ కావని మండిపడ్డారు. ఐఐటీ మద్రాస్ వివరణతో నిజాలను ఎక్కువకాలం దాయలేమన్న విషయం జగన్కు అర్థమై ఉంటుందన్నారు. ఈ సందర్భంగా చేసిన ట్వీట్లో అమరావతిపై వైసీపీ వివిధ సందర్భాల్లో చేసిన విమర్శలను అంశాల వారీగా లోకేశ్ ప్రస్తావించారు.
సమాధానం దాటవేసి మీరో మెయిల్ పెట్టుకోండి అన్న మంత్రి బొత్సా
రాజధానిగా అమరావతి ప్రాంతం ఏమాత్రం అనుకూలం కాదని ఐఐటీ మద్రాస్ తన నివేదికలో తెలిపిందంటూ ఏపీ మంత్రి బొత్సా ప్రకటన చేశారు. ఇక నేడు మంత్రి బొత్స మద్రాస్ ఐఐటీ అలంటి నివేదిక ఇవ్వలేదు అన్న వార్తలపై మేము చెప్పేవన్నీ అబద్ధాలే అంటారా? అని ప్రశ్నించారు బొత్స సత్యన్నారాయణ కావాలంటే మీరు ఐఐటీ మద్రాస్ కు మెయిల్ పెట్టుకోండి అని వ్యాఖ్యానించారు. శివరామకృష్ణన్ కమిటీ కూడా అబద్ధమేనా? అని ప్రశ్నించారు.