కావూరి టిడిపిలోకి వద్దు: గెలవాలని మాగంటి సవాల్
హైదరాబాద్/ఏలూరు: కాంగ్రెసు పార్టీని వీడుదామనుకుంటున్న కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావుకు తెలుగుదేశం పార్టీలో చోటు లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కావూరి త్వరలో టిడిపిలో చేరుతారనే ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే. టిడిపిలో చేరేది లేదని కావూరి చెప్పినప్పటికీ... ఆయన చూపు సైకిల్ పైనే ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో కావూరిని పార్టీలో చేర్చుకోవద్దని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారట.
టిడిపి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఆ పార్టీలో చేరేందుకు తాను సిద్ధమని కావూరి సంకేతాలు పంపిస్తున్నారట. తనతో పాటు ఇన్నాళ్లూ పని చేసిన కార్యకర్తల్లో ఎక్కువ మంది మంది టిడిపిలో చేరమని తనకు సూచిస్తున్నట్లు కావూరి అంటున్నారట. టిడిపిలో చేరేందుకు ఆయన మానసికంగా దాదాపు సిద్ధమయ్యారని, ఈ మేరకు టిడిపి ముఖ్య నేతలతో మంతనాలు కూడా జరుపుతున్నారని, త్వరలోనే అధికారికంగా ఆ పార్టీలో చేరుతారంటున్నారు.
అయితే, ఆయన చేరికకు మాత్రం స్థానిక టిడిపి క్యాడర్ ససేమీరా అంటోంది. తమ పార్టీలో కావూరికి చోటు లేదని ఆ పార్టీ నేత మాగంటి బాబు తెలిపారు. ఏలూరులో ఆయన మాట్లాడుతూ, కావూరికి స్థానం లేనప్పటికీ ఆయన అనుచరులకు మాత్రం స్థానం ఉంటుందన్నారు. కావూరికి సత్తా ఉంటే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.
ఎన్నికల సమయంలో ఆయనను పార్టీలోకి తీసుకుంటే అందరినీ అడ్డగోలుగా చేర్చుకుంటున్నారనే తప్పుడు సంకేతాలు వెళ్తాయని క్యాడర్ భావిస్తోంది. సీమాంధ్ర ప్రయోజనాలు, సమైక్యాంధ్ర కోసం రాజీనామాలు చేసిన నేతలు ఉన్నారని, కేంద్రమంత్రిగా ఉండి కావూరి ఏం చేశారనే మరో వాదన కూడా వినిపిస్తోంది. పైగా మంత్రి పదవి వచ్చాక ఆయన సైలెంట్ అయిపోయారని చెబుతున్నారు.
కాగా, ఢిల్లీలో మంగళవారం కావూరి విలేకరులతో మాట్లాడుతూ... కాంగ్రెసు తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా లేనని చెప్పారు. కార్యకర్తలతో సంప్రదింపులు జరిపినప్పుడు 71 శాతం మంది టిడిపిలో చేరాలని చెబుతున్నారని, ఏడు శాతం మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలంటున్నారన్నారు.