లాంచీ ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణ: తూ.గో జిల్లా జాయింట్ కలెక్టర్ కు బాధ్యత: పరిహారం చెల్లింపు
రాజమహేంద్రవరం: రెండు తెలుగు రాష్ట్రాలను విషాదంలో ముంచెత్తిన గోదావరిలో లాంచీ ప్రమాదం ఘటనపై ప్రభుత్వం పూర్తిస్థాయి న్యాయ విచారణకు ఆదేశించింది. దీని బాధ్యతలను తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కు అప్పగించింది. ఆయనను మెజెస్టీరియల్ విచారణాధికారిగా నియమించింది. ఈ మేరకు పరిశ్రమలు, ఓడరేవుల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలల వ్యవధిలో ఆయన తన నివేదికను ప్రభుత్వానిక అందజేయాల్సి ఉంటుంది. ఈ నెల 15వ తేదీన తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని కచ్చులూరు వద్ద 61 మంది పర్యాటకులు, 11 మంది సిబ్బందితో పాపికొండల వైపునకు ప్రయాణిస్తోన్న రాయల్ వశిష్ఠ బోటు గోదావరి నదిలో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
కారణాలపై విచారణ.. 60 రోజుల్లో నివేదిక
ఈ ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీయడానికి ప్రభుత్వం ఈ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. రాయల్ వశిష్ఠ లాంచీ ప్రమాదానికి దారి తీసిన కారణాలపై సమగ్ర నివేదికను 60 రోజుల్లోగా అందజేయాలని సూచించింది. రాజమహేంద్రవరం నుంచి బయలుదేరిన లాంచీ అసలు సామర్థ్యం ఎంత? గరిష్ఠంగా అందులో ఎంతమంది పర్యాటకులు ప్రయాణించడానికి అవకాశం ఉంది? సామర్థ్యానికి మించి పర్యాటకులను తీసుకెళ్లడానికి గల కారణాలు.. వంటి అంశాలన్నింటినీ విచారణాధికారి తన నివేదికలో పొందుపరచాల్సి ఉంటుంది. గోదావరి వరద పోటుకు గురై, ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో బోటింగ్ ను ప్రభుత్వం నిషేధించింది. ప్రమాదానికి గురైన సమయంలో గోదావరిలో అయిదు లక్షల నుంచి ఏడు లక్షల క్యూసెక్కుల వరదనీరు ప్రవహిస్తున్నట్లు జల వనరుల శాఖ అధికారులు ఇదివరకే వెల్లడించారు.
13 మంది జాడ కోసం గాలింపు..
అయినప్పటికీ.. 14, 15 తేదీలు వారాంతపు రోజులు కావడంతో బోటింగ్ నిర్వహించారు ఆపరేటర్లు. దీనికోసం వారు ఎవరి అనుమతి తీసుకున్నారు? ఏ అధికారి వారికి అనుమతులు ఇచ్చారు? దీనికి గల లిఖిత పూరకమైన ఆదేశాలు జారీ చేశారా? వంట విషయాలపై సమగ్ర దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఇదిలావుండగా- లాంచీ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాల గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకా 13 మంది జాడ తెలియరాలేదు. వారి కోసం అన్వేషిస్తున్నారు. బుధవారం కురిసిన భారీ వర్షాల వల్ల గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. వర్షం వెలిసిన తరువాత గాలింపు చర్యలు కొనసాగాయి. గోదావరి నదీ గర్భంలో సుమారు 315 అడుగుల లోతున లాంచీ చిక్కుకుని ఉన్నట్లు గుర్తించారు. దాన్ని వెలికితీయడం ఇప్పట్ల సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు.
మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపు..
గోదావరి లాంచీ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నష్ట పరిహారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని అందజేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాదం సంభవించిన రోజే ప్రకటించారు. ఏ మాత్రం జాప్యం లేకుండా ఈ పరిహారం మొత్తాన్ని విడుదల చేసింది. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేశారు. మృతుల సంఖ్య తేలిన తరువాత.. వాటిని అందజేయనున్నారు. ఈ ప్రమాదంలో ఇంకా 13 మంది జాడ తెలియరావట్లేదు. వారు మరణించి ఉంటారని అధికారులు నిర్ధారించారు. మృతదేహాల కోసం కచ్చులూరు నుంచి దిగువకు పోలవరం, ధవళేశ్వరం బ్యారేజీ వరకూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తీర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బలగాలు.