వోల్వో ప్రమాదం: బాధితుల ధర్నాలో ఇలా (ఫొటోలు)
హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు ప్రమాద బాధితులు శుక్రవారం హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద ధర్నా నిర్వహించారు. బస్సు యజమానులను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ, తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ పాల్గొన్నారు. ఈ బస్సు ప్రమాదంలో 45 మంది మరణించిన విషయం తెలిసిందే.
మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన బస్సు దుర్ఘటనకు నిరసనగా ఈ నెల 18న హైదరాబాద్లోని ఓల్వో షోరూమ్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ప్రకటించారు. ప్రమాదానికి గురైన బస్సు దివాకర్ ట్రావెల్స్దని స్పష్టమవుతున్న ప్పటికీ, దాని యజమాని జె.సి. ప్రభాకర్రెడ్డిని అరెస్టు చేయలేని చేతగాని ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని మండిపడ్డారు. అక్రమ టూర్ ఆపరేటర్స్ ఆస్తులు, బస్సులను స్వాధీనం చేసుకొని, వాటిని వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బుతోనైనా మృతుల కుటుంబాలకు పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు.
అక్రమంగా నడుస్తున్న ప్రైవేటు బస్సులను నిషేధించకపోతే, ప్రజలే వాటిని తగలబెట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఓల్వో బస్సులో సాంకేతిక లోపాలు, బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం కారణంగానే మహబూబ్నగర్ దుర్ఘటన జరిగిందని విమర్శించారు. వీటన్నింటినీ సరిగా పరిశీలించాల్సిన ప్రభుత్వం విఫలమైందని, అందుకే అవన్నీ సర్కారీ హత్యలేనని చెప్పారు. మృతుల కుటంబాలకు ఇప్పటివరకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఒకవైపు అక్రమ టూరిస్టు సంస్థలు నడుపుతున్న ఓల్వో బస్సులు ప్రమాదాలకు గురవుతుంటే, మరోవైపు హైదరాబాద్లో రెండు కొత్త ఓల్వో ఆఫీసులు ప్రారంభిస్తున్నారని విమర్శించారు.
ఎంఎల్సి యాదవరెడ్డి మాట్లాడుతూ ఓల్వో బస్సు ఐరోపా దేశాల రహదారు లకు అనుగుణంగా రూపొందించారని, అవి మన దేశ రోడ్లకు పనికిరావని చెప్పారు. కాబట్టి ప్రభుత్వం ఆ బస్సులను అనుమతించే విషయంపై నిర్ణయం తీసుకోవాలన్నారు. హైవే పెట్రోలింగ్ను పటిష్టం చేయాలని, ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలని అన్నారు.
కోదండరామ్ మాట్లాడుతూ - జెసి దివాకర్రెడ్డి, ప్రభాకర్రెడ్డిల రాజకీయ ప్రాబల్యం కారణంగానే కేసులు పెట్టలేదని, వారివురిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇక ముందు జరిగే ఉద్యమాలలో జెఎసి కూడా పాల్గొంటుందని చెప్పారు. అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ మహబూబ్నగర్ దుర్ఘటనలో దోషులకు తగిన శిక్ష వేయా లని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దోసపాటి రాము మాట్లాడుతూ నిందితులను శిక్షించే వరకు అన్ని పార్టీలు కలిసి పోరాడాలన్నారు.
బస్సు దుర్ఘటనలో మరణించిన అక్షరు సింగ్ తండ్రి అనిల్ సింగ్ మాట్లాడుతూ తమ కుమారుని భౌతికకాయం తమకు అప్పగించేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సుధాకర్లు అందించిన సహ కారం మరవలేదని చెప్పారు. రూహియా తండ్రి అబ్దుల్ రవూఫ్ మాట్లాడుతూ దుర్ఘటన జరిగి 18 రోజులైనా తప్పు ఎవరు చేశారో ఎవరూ ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. వేరే దేశం లోనైతే దోషు లను బహిరంగంగా కాల్చేసేవారని అన్నారు.
18న వోల్వో షోరూం వద్ద ధర్నా
మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదానికి నిరసనగా ఈ నెల 18వ తేదీన వోల్వో షోరూం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు సిపిఐ కార్యదర్శి కె. నారాయణ చెప్పారు.
ధర్నాలో బాధితులు..
మహబూబ్నగర్ జిల్లా బస్సు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాల సభ్యులు హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద జరిగిన ధర్నాలో ఇలా కనిపించారు.
తమవారి చిత్రాలతో..
బస్సు ప్రమాదంలో మరణించిన తమవారి చిత్రాలతో బాధితులు ధర్నాలో పాల్గొని ప్రమాదానికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆ బాధ చెప్పేది కాదు..
మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదానికి బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.
కోదండరామ్ ఇలా..
మహబూబ్నగర్ జిల్లా బస్సు ప్రమాదం బాధితులను తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ పరామర్శించారు. ధర్నాలు పాల్గొని సంఘీభావం తెలిపారు.