మహరాష్ట్ర అడిషనల్ డీజీ లక్ష్మీనారాయణ విఆర్ఎస్కు సర్కార్ ఓకే
ముంబై: మహారాష్ట్ర అదనపు డీజీపీ సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీఆర్ఎస్ కోరుతూ లక్ష్మీనారాయణ ఇటీవల మహారాష్ట్ర డీజీపీకి దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు విఆర్ఎస్కు ప్రభుత్వం బుధవారం నాడు ఆమోదం తెలిపింది..
ఐపీఎస్ లక్ష్మీనారాయణ గతంలో డిప్యూటేషన్పై ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో సీబీఐ జాయింట్ డైరెక్టర్గా పని చేశారు. నిజాయతీ గల అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కొన్ని ముఖ్యమైన కేసుల్లో చూపించిన తెగువతో ఎంతోమంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు. అనంతరం లక్ష్మీనారాయణ మహారాష్ట్రకు బదిలీ అయ్యారు.
రాజకీయాల్లోకి వచ్చేందుకు లక్ష్మీనారాయణ ఉద్యోగానికి స్వస్తి చెప్పారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన ఖండించారు. మీడియానే ఈ రకంగా ప్రచారం చేస్తోందన్నారు.తన వీఆర్ఎస్కు ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు లక్ష్మీనారాయణ ఇదివరకే ప్రకటించారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్లో వివిధ కార్యక్రమాలకు ఆయన తరచూ హాజరవుతున్నారు. అయితే రాజకీయ రంగ ప్రవేశంపై మాత్రం ఆయన ఆచితూచి స్పందిస్తున్నారు.ఏపీ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. అయితే అదే సమయంలో ఇప్పటికే ఏపీలో ఎన్నికల వేడి కొనసాగుతుంది. ఈ తరుణంలో లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.