కలకలం: బాబుకు మహారాష్ట్ర కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్, ఈ 15 మందికీ, కారణం ఇదే
Recommended Video
అమరావతి/ధన్బాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా 16 మందికి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు గురువారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. బాబ్లీ ప్రాజక్టుకు వ్యతిరేకంగా 2010లో చేసిన పోరాటానికి గాను ఈ వారెంటును జారీ చేసింది. ఈ నెల 16వ తేదీ లోపు చంద్రబాబుతో పాటు అందరూ హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. కేసును 21వ తేదీకి వాయిదా వేసింది.
చదవండి: లగడపాటి సర్వే, కాంగ్రెస్ గెలుపు, కేసీఆర్కు భారీ షాక్ అంటూ: అసలు నిజం ఏమంటే?
చంద్రబాబును కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబుకు నోటీసులు వస్తాయని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు నోటీసులు రావడం చర్చనీయాంశంగా మారింది. నాడు చంద్రబాబుపై కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కేసు నమోదైంది. బీజేపీ హయాంలో నోటీసులు వచ్చాయి. చంద్రబాబుకు నోటీసులు రావడం కలకలం రేపుతోంది.
నోటీసులు ఎందుకు జారీ చేశారు?
2010లో మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ అప్పుడు పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు తెలంగాణ సరిహద్దు దాటి మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లడానికి ప్రయత్నాలు చేశారు. దీంతో చంద్రబాబుతో పాటు 40 మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.
చంద్రబాబు సహా వారిపై లాఠీఛార్జ్
బార్డర్ దాటడంతో మహారాష్ట్ర పోలీసులు అప్పట్లో టీడీపీ నేతలను బలవంతంగా బస్సులో ఎక్కించారు. ధర్మాబాద్ నుంచి ఔరంగబాద్ ఎయిర్ పోర్టుకు తీసుకు వెళ్లారు. వారు అనుమతి లేకుండా ప్రాజెక్టు వద్దకు వచ్చారని తరలించారు. ఈ బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేసిన పోరాటానికి సంబంధించి ఈ అరెస్ట్ వారెంట్ వచ్చింది. నాడు చంద్రబాబు సహా పలువురిపై లాఠీచార్జ్ జరిగింది.
నాటి నుంచి పెండింగులో కేసు
నాటి నుంచి ఈ కేసు ధర్మాబాద్ కోర్టులో పెండింగ్లో ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల మహారాష్ట్ర వాసి ధర్మాబాద్ కోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో బాబ్లీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆ కేసును తవ్వితీశారు. దీనిపై చంద్రబాబు, టీడీపీ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇన్నేళ్ల తర్వాత అరెస్ట్ వారెంట్ రావడంపై చర్చ సాగుతోంది. నోటీసులు వస్తే చంద్రబాబు కోర్టుకు హాజరవుతారని నారా లోకేష్ స్పష్టం చేశారు.
నోటీసులు ఎవరెవరికి అంటే?
ఈ నోటీసులు ఏపీ సీఎం చంద్రబాబు సహా 16 మందికి వచ్చాయి. ఏపీ, తెలంగాణ ప్రజాప్రతినిధులు ఉన్నారు. చంద్రబాబుతో పాటు దేవేందర్ గౌడ్, మంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, ఆనంద బాబు, చింతమనేని ప్రభాకర్, సాయన్న, హన్మంత్ షిండే, గంగుల కమలాకర్, టీ ప్రకాశ్ గౌడ్, చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎల్ఎన్ రాజు, విజయరమణ రావు తదితరులు ఉన్నారు.