20న ఏపీకి మహారాష్ట్ర హోం మంత్రి: కట్టి పడేసిన దిశ చట్టం, సమగ్ర అధ్యయనం.. !
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చట్టం.. దిశ యాక్ట్: మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే కిరాతకులకు 21 రోజుల్లోనే మరణ శాసనాన్ని లిఖించడానికి ఉద్దేశించిన చట్టం ఇది. ఈ తరహా చట్టాన్ని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా నిలిచింది ఏపీ. పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఇలాంటి చట్టాలను రూపొందించడానికి బాటలు వేసింది. ఇదివరకే ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాలు దిశ చట్టాన్ని ప్రశంసించాయి. దీనికి సంబంధించిన కాపీలను తెప్పించుకున్నాయి.
బీజేపీ ఏపీ పగ్గాలు మాధవ్ చేతికి? ఉత్తరాంధ్ర.. బీసీ కార్డు.. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలిసొస్తాయా?
20న మహారాష్ట్ర హోం మంత్రి..
తాజాగా- మహారాష్ట్ర కూడా ఆ రాష్ట్రాల జాబితాలో చేరింది. ఈ చట్టాన్ని అధ్యయనం చేయడానికి మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్ ఏపీకి రానున్నారు. ఆయన వెంట మహారాష్ట్ర అదనపు డీజీపీ, హోం మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి పలువురు ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక ప్రతినిధుల బృందం రానుంది. దిశ చట్టం ముసాయిదా కాపీలను అధ్యయనం చేయడంతో పాటు దిశ యాప్ ద్వారా అందే ఫిర్యాదులు, వాటి పరిష్కారాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయనున్నారు మహారాష్ట్ర అధికారులు.
ముఖ్యమంత్రి, హోం మంత్రితో భేటీ..
తన పర్యటన సందర్భంగా అనిల్ దేశ్ముఖ్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, పోలీసు డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్లతో భేటీ కానున్నారు. దిశ చట్టంలో పొందుపరిచిన అంశాలు, 21 రోజుల్లోనే ఉరిశిక్షను విధించడానికి గల సాధ్యసాధ్యాలపై వారిని అడిగి తెలుసుకుంటారు. మహిళల భద్రతపై కఠిన నిర్ణయాలను తీసుకోవడానికి వెనుకాడబోమంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే.. తన కామన్ మినిమమ్ ప్రోగ్రామ్లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
దిశ పోలీస్ స్టేషన్ను సందర్శించే ఛాన్స్..
దిశ చట్టంలో భాగంగా నెలకొల్పిన పోలీస్ స్టేషన్లను కూడా అనిల్ దేశ్ముఖ్ పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యాప్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించడం దగ్గరి నుంచి వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్కు చేరవేయడం, ఆ వెంటనే బాధితుల వద్దకు పోలీసులను పంపించడం వరకూ ప్రతి అంశాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేస్తారు. ఇప్పటిదాకా నమోదైన కేసులు, వాటిని పరిష్కరించడానికి అనుసరించిన పద్ధతులు, ఆ కేసుల పూర్వాపరాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video
దిశ చట్టాన్ని ప్రశంసిస్తూ ట్వీట్..
దిశ చట్టాన్ని ప్రశంసిస్తూ అనిల్ దేశ్ముఖ్ ఓ ట్వీట్ చేశారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారిలో భయాన్ని కలిగించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించిందని అన్నారు. తమ రాష్ట్రంలోనూ ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనిపై అధ్యయనం చేయడానికి తాను 20వ తేదీన ఆంధ్రప్రదేశ్కు వెళ్తున్నట్లు వెల్లడించారు. వీలైనంత త్వరగా మహారాష్ట్రలో ఈ చట్టాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.