సెకెండ్ ఇన్నింగ్: మహారాష్ట్రలో భారీ వర్షాలు..గోదావరికి మళ్లీ వరదపోటు..ధవళేశ్వరం ఫుల్!
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల జీవన ప్రదాయినిగా పేరున్న గోదావరి నది మరోసారి వరద ప్రవాహాన్ని సంతరించుకుంది. గోదావరి తీర ప్రాంతంలోని పలు లంక గ్రామాలు ప్రమాదం అంచున నిల్చున్నాయి. వరద బారిన పడే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. కొద్దిరోజులుగా మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల గోదావరి నది ఉగ్రరూపాన్ని దాల్చింది. గోదావరి నది వరద ప్రవాహానికి గురి కావడం ఈ వర్షాకాల సీజన్ లో ఇది రెండోసారి. గోదావరి నది మీద రెండు రాష్ట్రాల్లో నిర్మించిన రిజర్వాయర్లు, బ్యారేజీలు నిండుకుండల్లా మారిపోయాయి. ఒకవంక కృష్ణా..మరోవంక గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. వచ్చే ఏడాది వేసవిలో నీటి ఎద్దడి ఉండదనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు.
100 మిల్లీమీటర్లకు పైగా వర్షం..
గోదావరి నదీ పరీవాహక ప్రాంతం సహా మహారాష్ట్ర వ్యాప్తంగా కొద్దిరోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. తీర ప్రాంత నగరం ముంబై.. ఈ భారీ వర్షాల తాకిడికి చివురుటాకులా అల్లాడిపోతోంది. జనజీవనం స్తంభించిపోయింది. అక్కడ ఇంకా ఎడతెరిపి లేని వర్షాల కురుస్తున్నాయి. వచ్చే 48 గంటల్లో మహారాష్ట్రలోని మరాఠ్వాడ, విదర్భ, కొంకణ్ ప్రాంతాలు సహా గోవాలో మరిన్ని భారీ వర్షాలు కురవడానికి అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కొంకణ్, గోవా, విదర్భ ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని తెలిపారు. అత్యధికంగా గోండియాలో 208 మిల్లీమీటర్లు వర్షపాతం కురిసింది. అలాగే- వెంగుర్లలోని 159, మహాబలేశ్వర్-147, దహను-146, అలీబాగ్-127, ముంబై-119 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. గోదావరి ప్రవహించే మధ్య మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్ల వరకు వర్షం కురిసింది.
48 గంటల్లో మరిన్ని భారీ వర్షాలు..
ముంబై, థానే, కొలాబా, అలీబాగ్, రత్నగిరి, సింధుదుర్గ్, కొల్హాపూర్, పుణే, మహాబలేశ్వర్, నాగ్ పూర్, గోండియా, అకోలా, అమరావతి, దహను, జల్ గావ్, నాశిక్ వంటి ప్రాంతాల్లో వచ్చే 36 నుంచి 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడటం ఖాయమని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇప్పటిదాకా కురిసిన భారీ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. గోదావరి నదికి మరోమారు వరద సంభవించింది. వచ్చే 48 గంటల్లో మరిన్ని భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో గోదావరి ఉప్పొంగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తీర ప్రాంతం పొడవునా గోదావరి నది తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి నదీ ప్రమాదకర హెచ్చరికలను దాటి ప్రవహిస్తోంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు.
తెలుగు రాష్ట్రాల్లో అప్రమత్తం..
దాని ప్రభావం మన రాష్ట్రంపైనా పడింది. తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం వద్ద శనివారం రాత్రి నుంచి వరద ఉద్ధృతి పెరిగింది. దేవీపట్నం సహా గోదావరి ఒడ్డున ఉన్న 36 గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ఏజెన్సీ గ్రామాలు వరద ముంపు బారిన పడ్డాయి. పలు చోట్ల రహదారిపైకి భారీగా వరదనీరు చేరింది. ఫలితంగా చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయినట్లు చెబుతున్నారు. ఏజెన్సీలోని పలు గ్రామాల్లో పంటలు నీట మునిగినట్లు అధికారులు గుర్తించారు. భద్రాచలం వద్ద నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ నీటిమట్టం 45 అడుగులకు పైగా చేరింది. పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్నాన ఘట్టాలు నీట మునిగాయి. గోదావరి పరిసర ప్రాంతాల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు.
ధవళేశ్వరం బ్యారేజీ నుంచి నీటి విడుదల
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉప్పొంగుతోంది. మహారాష్ట్రలో గోదావరి నదీ తీర పరీవాహక ప్రాంతాల్లో మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన నేపథ్యంలో ధవళేశ్వరం వద్ద వరద ఉద్ధృతి మరింత పెరగవచ్చని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఉధృతి కొనసాగుతోంది. ఫలితంగా ఈ ఉదయం బ్యారేజీ నుంచి సముద్రంలోకి సుమారు 10 లక్షల మేర క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. డెల్టా కాలువకు 8,700 క్యూసెక్కుల విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. గౌతమి, వశిష్ఠ, వైనతేయ, వృద్ధ గౌతమి పాయలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా- లంక గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎప్పుడు గోదావరి ఉప్పొంగినా.. దాని బారిన పడే లంక గ్రామాల్లో చాటింపు వేయించారు.