మహారాష్ట్ర సంక్షోభం-జగన్ నేర్చుకోవాల్సిన పాఠాలివే ! లేకపోతే ఉద్ధవ్ గతే?
మహారాష్ట్రలో బీజేపీకి వ్యతిరేకంగా ఎన్సీపీ, కాంగ్రెస్ లతో జతకట్టి సీఎం పదవి తీసుకున్న శివసేన ఛీఫ్ ఉద్ధవ్ థాక్రే ఇప్పుడు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయారు. శివసేన ఎమ్మెల్యేల్లో తనపై గూడుకట్టుకున్న అసంతృప్తిని ఏమాత్రం గమనించకుండా పాలనలో మునిగిపోయిన బాల్ థాక్రే వారసుడు ఇప్పుడు అందుకు తగ్గ ఫలితం అనుభవిస్తున్నారు. శివసేన కోటలుగా భావించే అసెంబ్లీ సీట్లలో గెలిచిన ఎమ్మెల్యేలు సైతం ఇప్పుడు ఉద్ధవ్ ను కాదని షిండే క్యాంపులోకి వెళ్సిపోతున్నారు. దీంతో థాక్రేలకూ, వారి మానసపుత్రిక శివసేనకూ మధ్య బంధం తెగిపోయేలా ఉంది. దీన్నుంచి తొలిసారి సీఎంలైన వైఎస్ జగన్ వంటి వారు నేర్చుకోవాల్సిన పాఠాలు కనిపిస్తున్నాయి.
మహా సంక్షోభం నేర్పుతున్న పాఠాలు
మహారాష్ట్రలో తాజాగా శివసేనలో మొదలైన తిరుగుబాటు తీవ్రరూపం దాల్చి ఏకంగా ఆ పార్టీ వ్యవస్ధాపకుడైన బాల్ థాక్రే కుమారుడు ఉద్ధవ్ థాక్రే నుంచి పార్టీని లాక్కునే వరకూ వచ్చేసింది. ఇక షిండే నేతృత్వంలోని శివసేన ఎమ్మెల్యేలకు ఆయన బాస్ కావడమే కాదు శివసేనకు అధ్యక్షుడిగా కూడా ఎంపికయ్యేలా ఉన్నారు.
దీంతో ఉద్ధవ్ థాక్రే మరో పార్టీ పెట్టుకోవాల్సిన దుస్ధితి దాపురిస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్ధితుల్లో ఉద్ధవ్ థాక్రే కరోనాతో ఇంట్లోనే కూర్చుని అచేతనంగా కనిపిస్తున్నారు. అయితే ఈ దుస్ధితికి దారి తీసిన కారణాలను మాత్రం ఇతర ప్రాంతీయ పార్టీలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
ఎమ్మెల్యేలకూ, ఉద్ధవ్ కూ గ్యాప్
మహావికాస్ అఘాడీ పేరుతో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వానికి లీడర్ గా సీఎం బాధ్యతలు చేపట్టిన ఉద్ధవ్ థాక్రే రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. ఇందులో కరోనాతోనే ఏడాదిన్నర కాలం కరిగిపోయింది. ఇక సీరియస్ గా అధికారాన్ని అనుభించింది కేవలం ఏడాది మాత్రమే. అయితే ఈ రెండున్నరేళ్లలో రాష్ట్రంలో కరోనా ప్రభావం, తన వెన్నెముకకు సర్జరీ కారణంగా ఉద్ధవ్ థాక్రే ఎక్కువగా అధికార నివాసం వర్షకు పరిమితం అయ్యారు. ఎమ్మెల్యేలను కలిసేందుకు ఆయనకు తక్కువగా అవకాశం దొరికింది. దీంతో పరిస్ధితుల్ని వాడుకున్న ఏక్ నాథ్ షిండే ఇప్పుడు తిరుగుబాటు చేయడమే కాకుండా పార్టీ మొత్తాన్ని తన చేతుల్లోకి తీసేసుకుంటున్నారు.
జగన్ నేర్చుకోవాల్సిన పాఠమిదే?
ఉద్ధవ్ థాక్రే తరహాలోనే తొలిసారి ముఖ్యమంత్రి అయిన సీఎం జగన్ కూడా తాజాగా మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. ఈ మూడేళ్లలో సింహభాగం ఆయన పాలనపైనే దృష్టిపెట్టారు. పాలన సక్రమంగా ఉంటే అనుభవం లేదని విపక్షాలు చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టవచ్చని జగన్ భావించారు.
దీంతో పార్టీని పణంగా పెట్టి మరీ పాలనపై ఆయన దృష్టిపెట్టారన్న విమర్శలు ఉన్నాయి. ఈ లోపు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జ్ లు, ఎంపీలు ఇలా.. ఎవరికి వారు రెచ్చిపోతున్నారు. సమస్యలు తలెత్తినప్పుడల్లా వారిని బుజ్జగించి పంపడం మినహా పరిష్కారాలు చూపించలేకపోవడం జగన్ బలహీనతగా మారింది. ఇలా బుజ్జగించి పంపిన వారు మళ్లీ అదనుచూసి రెచ్చిపోతున్నారు. అలాగే ఎమ్మెల్యేలతో జగన్ తరచుగా టచ్ లో ఉండలేకపోతున్నారు. దీంతో ఇప్పటివరకూ పలువురు ఎమ్మెల్యేలు జగన్ ను వ్యక్తిగతంగా కలిసి సమస్యలు చెప్పుకోలేకపోయారు.
అన్ని ప్రాంతీయ పార్టీల్లాగే జగన్ కూ తన చుట్టూ కోటరీ ఉన్నా రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు అందరితోనూ పూర్తిస్దాయిలో సంబంధాలు లేవు. దీంతో సమస్యలు పెరుగుతున్నాయి. వీటిని పరిష్కరించుకోకపోతే శివసేన ఎదుర్కొంటున్న పరిస్ధితులు ఏపీలోనూ పునరావృతం అయినా ఆశ్చర్యం లేదు. కాబట్టి జగన్ ఇప్పటికైనా ప్రభుత్వ పాలనతో పాటు పార్టీపైనా దృష్టిపెట్టాల్సిన పరిస్ధితి కనిపిస్తోంది.